TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇది టీడీపీకి కాపులను దూరం చేసే కుట్రా?

Published on: Fri Nov 6, 2015 5:00PM



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైన కాపులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో వున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి కాపు జన సంఖ్యకు వుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా వున్న కాపులు ఆ తర్వాత  తమ సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని చూసి లేనిపోని ఉత్సాహం తెచ్చుకున్నారు. తమ నుంచి ఒక నంబర్ వన్ స్థానంలో నిలిచే నాయకుడు వచ్చాడని అనుకున్నారు. అయితే ఆ తర్వాత చిరంజీవి వాళ్ళ ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లి ఎంచక్కా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. ప్రస్తుతమయితే చిరంజీవి తన 150 (151?) సినిమా మీద తప్ప రాజకీయాల మీద ధ్యాస చూపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కాపులు చేరువవుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో కాపులకు ప్రాధాన్యమిస్తూ తమ మధ్య వున్న అంతరాన్ని చెరిపే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి కాపులను దూరం చేసే కుట్రలు ప్రారంభమయ్యాయని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. కాపు నాయకుడు రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందంటూ హరిరామ జోగయ్య తన ఆత్మకథలో పేర్కొనడాన్ని ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు.

హరిరామ జోగయ్య రాజకీయ జీవితం మొత్తం వివాదాలమయం. రాష్ట్రంలో ఆయన చేరని పార్టీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు మారే ఆయన పార్టీ మారగానే అప్పటి వరకూ తాను పనిచేసే పార్టీని నోటికొచ్చినట్టు తిట్టడంలో సమర్థుడు. అలాగే వివాదాస్పద కామెంట్లు చేసి వార్తల్లో వుండే విషయంలో కూడా ఆయన ఘనాపాటి. ఇప్పుడు వయసు అయిపోయి, రాజకీయ నిరుద్యోగంలో వున్న ఆయన తన ఆత్మకథలో వివాదాస్పద కామెంట్లు చేయడం తెలుగుదేశం పార్టీని కాపులకు దూరం చేసే కుట్రలో భాగమేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అయితే హరిరామ జోగయ్య మాటలకు ప్రజల్లోను, రాజకీయ వర్గాలలోను ఎంతమాత్రం విలువ వుండదని, అయినప్పటికి  తెలుగుదేశం మీద కక్షకట్టిన కొన్ని వర్గాలు జోగయ్య మాటలకు విలువ ఇచ్చి, అధిక ప్రచారం చేయడం ఆ వర్గాల రాజకీయ దిగజారుడు తనానికి, టీడీపీకి సన్నిహితమవుతున్న కాపులను దూరం చేసే ప్రయత్నాలకు  నిదర్శనాలుగా నిలుస్తాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.