కరోనా దెబ్బకు 2.5 కోట్ల ఉద్యోగాలు హాంఫట్
posted on Mar 19, 2020 12:14PM
కరోనా సెగ ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. రోడ్ సైడ్ వ్యాపారాలు 80 శాతం వరకు పూర్తిగా పడిపోయాయి. ఆదాయం లేకపోవడంతో మూడు పూటల తినే పరిస్థితి లేదు. రోజు సంపాదించుకుని తినే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. గతంలో కర్ఫ్యూ వున్న పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని చిన్న వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో, ట్యాక్సీవాలా ఆదాయం కూడా పూర్తిగా పడిపోతోంది. ఓలా, ఊబర్లకు బిజినెస్ చాలా తక్కువగా వస్తుందట. ఎయిర్ పోర్ట్ బిజినెస్ అయితే అసలే లేదు. ఇండియాలో కొంత బెటర్గా వున్నప్పట్టికీ ఇతర దేశాల్లో పరిస్థితి ఘోరంగా వుందట.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తెలిపింది. దాదాపు 2.5 కోట్ల (25 మిలియన్లు) ఉద్యోగులు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8,600 కోట్ల డాలర్ల నుండి 3.4 లక్షల కోట్ల డాలర్ల మేర ఆధాయాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.
అండర్ ఎంప్లాయిమెంట్ కూడా పెరిగే అవకాశముందని ILO ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కారణంగా వర్కింగ్ హవర్స్ తగ్గి, వేతనాలు తగ్గి ఈ పరిస్థితికి కారణం కావొచ్చునని పేర్కొంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పైనా ప్రభావం పడుతుందని పేర్కొంది.
అంతర్జాతీయంగా పరస్పర సహకార విధానాల ద్వారా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ILO తెలిపింది. కార్మికులను సంరక్షించేందుకు, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అలాగే ఉద్యోగాలు, ఆదాయలకు మద్దతిచ్చేందుకు అత్యవసర, పెద్ద ఎత్తున సమన్వయ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.