గుడిలో మద్యం తాగొద్దన్నందుకు పూజారిని చంపేశారు!!

 

గుడిలో మద్యం సేవించవద్దని వారించిన పూజారిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విష్ణుపురా ప్రాంతంలోని ఓ గ్రామంలో సుందర్‌ భూయా(55) పూజారిగా పనిచేస్తున్నారు. కాగా, శనివారం సాయంత్రం కొంతమంది ఆకతాయిలు మద్యం, మాంసంతో విందు చేసుకునేందుకు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి వద్దని, అటుగా అటవీప్రాంతానికి వెళ్లాలని పూజారి కోరారు. కానీ అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆయన గోడును వినిపించుకోకపోగా.. తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన దుండగులు ఆ పూజారిని చితకబాది కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరచారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇక పూజారి చనిపోయాడని భావించిన వారు ఆయన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. 

మరుసటిరోజు ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు పూజారి పొదల్లో ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూజారి కొనఊపిరితో ఉన్నట్లు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు చికిత్స అందిస్తుండగానే పూజారి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయేముందు పూజారి ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు.