జైలు నుండి ఎన్డీయే ఎమ్మెల్యేకు ఫోన్.. లాలూప్రసాద్ యాదవ్ పై జార్ఖండ్ సర్కార్ విచారణ

గడ్డి కుంభకోణంలో ప్రస్తుతం జార్ఖండ్ లోని రాంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ఎన్డీయే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని మాట్లాడినట్టుగా బయటపడిన ఆడియో టేపులు తాజాగా బీహార్ లో కలకలం రేపుతున్నాయి. జుడిషియల్ కస్టడీలో ఉన్న లాలూ ఫోన్ ఎలా వినియోగించారన్న విషయాన్ని తేల్చేందుకు జార్ఖండ్ సర్కారు విచారణకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ వెల్లడించారు. రాంచీ డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, బిస్రా ముండా జైలు సూపరింటెండెంట్ ల ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

 

అంతేకాకుండా ఆ ఆడియో క్లిప్ ను తాను కూడా విన్నానని, దాని ఆధారంగానే తాము విచారణకు ఆదేశించామని భూషణ్ వెల్లడించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారికి జైలు మాన్యువల్ ప్రకారం మొబైల్ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం లేదని, ఆయన ఫోన్ వాడుంటే, ఎవరి ఫోన్ ను వాడారన్న విషయాన్ని కూడా విచారణలో తేలుస్తామని తెలిపారు. మొత్తంగా ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయన అన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నతాధికారుల అనుమతితో రిమ్స్ డైరెక్టర్ బంగళాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లాలూను కలవడానికి వచ్చే వారి విషయంలో రాంచీ జిల్లా అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనను మళ్ళీ జైలుకు పంపేందుకు ఇప్పటికే అనుమతి కోరుతూ జార్ఖండ్ హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉంది. వైద్యులు ఒకసారి ఆయనను పరిశీలించి, ఆరోగ్యం విషయంలో నివేదిక ఇస్తే, దాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.