వైసీపీలో చేరిన పలువురు సినీ ప్రముఖులు
posted on Apr 1, 2019 11:41AM
ఏపీలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా ప్రధాన పార్టీల్లో చేరికలు ఆగట్లేదు. తాజాగా సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులు వైసీపీలో చేరారు. లోటస్ పాండ్లో సోమవారం ఉదయం వైసీపీ అధినేత జగన్ తో భేటీ అనంతరం.. పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు సినీ నటి హేమ, యాంకర్ శ్యామల దంపతులు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
జగన్తో సమావేశం అనంతరం రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. గతంలో జగన్తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. అయితే తాము గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరని రాజశేఖర్ వెల్లడించారు. హైటెక్ సిటీకి పునాది వేసిన చంద్రబాబు సీఎంగా మంచి పేరే తెచ్చుకున్నారని, తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయరంగానికి మేలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు జగన్ అని, ఆయన ఓ పులిబిడ్డ అని అభివర్ణించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరిలో కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ అయితే బావుంటుందని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.