పార్టీలో చేరాలని జేసీ ఫ్యామిలీకి ఫోన్లు!!

 

జేసీ కుటుంబం టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి సైతం ధ్రువీకరించారు. అయితే ప్రస్తుతం తనకి టీడీపీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేసారు. తాజాగా ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్పందించారు. తాము టీడీపీని వీడుతున్నామన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలిపారు. కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

బీజేపీలో తాము చేరడం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరాలని తనను ఇద్దరు, ముగ్గురు నేతలు ఫోన్లు చేసి అడిగారనీ, ‘నాకు పదవులు అవసరం లేదు. నా కార్యకర్తల కోసమే రాజకీయాల్లో ఉన్నా’ అని వారికి స్పష్టం చేసినట్లు చెప్పారు. గత 40 ఏళ్లుగా కార్యకర్తలు తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా నిలవడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.