బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు కోసం.. జేసీ రాజకీయ సన్యాసం..
Published on: Tue Apr 19, 2022 11:39AM
జేసీ ప్రభాకర్రెడ్డి. టీడీపీ ఫైర్బ్రాండ్ లీడర్. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. స్ట్రాంగ్ లీడర్గా రాటు దేలారు. కేసులు, కుట్రలు, దాడులకు భయపడలేదు. వైసీపీ బెదిరింపులకు వెనకడుగు లేదు. తాడిపత్రి మున్సిపల్ పీఠం దక్కించుకొని.. బస్తీ మే సవాల్ అంటూ తొడగొట్టి తఢాకా చూపించారు. అలాంటి బలమైన నాయకుడు సడెన్గా రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ ప్రకటించి కలకలం రేపారు. ఇంతకీ జేసీ ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు? అసలేం జరిగింది?
ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రి అయ్యారు. కళ్యాణదుర్గంలో భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఆ బలప్రదర్శనలో అరాచకం జరిగింది. పాపం.. 7 నెలల పసికందు చనిపోయింది. మంత్రి గారి ర్యాలీ అంటూ పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో.. చికిత్స అందక ఆ చిన్నారి మృత్యువాత పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చారు. అయినా, మంత్రి ఉషశ్రీలో చలనం లేకుండా పోయింది. కనీసం పరామర్శకు కూడా రాలేదు. దీంతో, ఆ పసికందు మృతికి న్యాయం చేయాలంటూ ఆ కుటుంబానికి మద్దతుగా స్థానిక టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అంతే, జస్ట్ న్యాయం కోసం డిమాండ్ చేసిన పాపానికే.. ఆ టీడీపీ నాయకుడిపై రౌడీషీట్ తెరిచారు పోలీసులు. ఇదేమీ రాజ్యం.. ఇదేమీ పోలీసుల అరాచకం అంటూ అంతా మండిపడుతున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై కేసులు, రౌడీషీటర్ కేసు నమోదు చేస్తే భయపడేది లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చిచెప్పారు. కల్యాణదుర్గంలో పసిపాప మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రకాశ్నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారా? అని ప్రశ్నించారు. అనంతపురంలో చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్నాయుడి ఇంటికెళ్లి పరామర్శించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మరింత పని చేస్తానన్నారు.
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఈ రాజకీయాలతో విసుగు చెందానని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని జేసీ ప్రకటించారు.


