TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు షాకింగ్ తీర్పు

Published on: Mon Apr 6, 2026 9:02PM

 

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాతాంకుళం కస్టడీ డెత్ కేసులో కోర్టు సంచలనమైన తీర్పు వెలువడింది. తండ్రి–కుమారులపై జరిగిన దారుణ హింసపై విచారణ పూర్తి చేసిన మదురై కోర్టు 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తూ పోలీసు వ్యవస్థకు గట్టి హెచ్చరికగా మారింది. 2020లో కరోనా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో సాతాంకుళంలో మొబైల్ షాప్ నడిపినందుకు వ్యాపారి జయరాజ్ మరియు ఆయన కుమారుడు బెనిక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతించిన సమయానికి మించి దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో వారిని స్టేషన్‌కు తరలించారు.

అయితే పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తండ్రి–కుమారులు తీవ్ర హింసకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. తరువాత వారిపై నమోదైన ఆరోపణలు అసత్య మని బయటపడటం ఘటనను మరింత సంచలనంగా మార్చింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రజలు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం పలువురు పోలీసులపై హత్య, కస్టడీ టార్చర్ కేసులు నమోదు చేసి కోర్టులో దీర్ఘకాల విచారణ కొనసాగింది.

పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై హత్య ఆరోపణలు నిరూపితమయ్యాయని కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ముత్తుకుమార్ ఈ ఘటనను “అరుదైన కేసులలోకెల్లా అరుదైనది”గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్కు రెండు శిక్షలు విధించారు. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు మరణశిక్ష, 84.1 లక్షల జరిమానా విధించారు. ఇతర నిందితులందరినీ సమానంగా బాధ్యులుగా పరిగణించారు. ఈ తీర్పు దేశంలో పోలీసు దుర్వినియోగం, మానవ హక్కుల పరిరక్షణపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిపుణులు కూడా పోలీసు సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడు తున్నారు. సాతాంకుళం కేసులో వెలువడిన ఈ తీర్పు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.