సంపూర్ణ మద్యనిషేధం సాధ్యం కాదు: జేపీ

 

సంపూర్ణ మద్య నిషేధం ఆచరణ సాధ్యం కాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. తాజాగా తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ మద్య నిషేధానికి, మద్యం నియంత్రణకు చాలా తేడా ఉందని అన్నారు.

మద్యానికి బానిసైన లక్షలాది పేద కుటుంబాలు నాశనమైపోతున్నాయని అన్నారు. మద్యం ప్రభావం పేద కుటుంబాలపై తీవ్రంగా ఉందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదని.. అయితే, మద్య నిషేధం ప్రపంచంలో ఎక్కడ అమలు చేసినా కొంత కాలం తర్వాత అవినీతికి ఆస్కారం ఉంటుంది కనుక, కఠిన మద్య నియంత్రణ అమలు చేయడం అవసరమని అన్నారు.

బహిరంగ మద్యపాన నిషేధం విధించాలని, మద్యం సేవించి వాహనం నడిపినా, చిన్న నేరం చేసినా కఠిన శిక్షలు విధించేలా ఉండాలని, మద్యానికి బానిసలైన వారికి డీ-అడిక్షన్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. మద్యానికి బానిసైన వారి సంఖ్యను తగ్గించకుండా, మద్యపాన నిషేధం కోసం సరైన ఏర్పాట్ల చేయకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. సామాన్యులకు, పేదలకు మద్యం అందుబాటులో లేకుండా చేయాలని, మద్యానికి బానిసలైన వారిని దాని నుంచి బయటపడేలా చేయాలని, అందుకోసం ఓ పద్ధతి ప్రకారం వెళితే కచ్చితంగా ఫలితాలు వస్తాయని జేపీ అన్నారు.