ఆమాత్రం దానికే ఆమె పరువు పోయిందా? ఏవిటో!

 

తన సినిమా, రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న జయలలిత ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో వున్నారు. ప్రస్తుతం అధికారంలో వున్న జయలలిత డీఎంకే పార్టీ భవిష్యత్తులో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నట్టుగా తొక్కేశారు. అయినప్పటికీ తనను గతంలో అసెంబ్లీ సాక్షిగా అవమానించిన డీఎంకే నాయకులను అంత సులభంగా ఆమె వదిలేలా లేరు. తాజాగా డీఎంకే నాయకుడు స్టాలిన్‌ మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం దావా వేశారు. అసెంబ్లీ బయట తనకు, అసెంబ్లీ స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని జయలలిత తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో జయలలిత పరువేం పోయిందో అర్థంకాక అందరూ తలలు బాదుకుంటున్నారు. అసెంబ్లీ నుంచి బయటకి వచ్చిన స్టాలిన్ జయలలితకు, స్పీ్కర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో వున్నవారు ముఖ్యమంత్రికి, స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొత్త విషయమేమీ కాదు.. అది అంతగా పరువునష్టం అని భావించాల్సిన విషయం కూడా కాదు. గతంలో ఇంతకంటే ఘోర అవమానాలను ఎదుర్కొన్న జయలలిత అస్సలు పరువునష్టం కాని అంశం మీదే పరువునష్టం దావా వేశారంటే దీని వెనుక ఏదో మతలబు వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.