TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయ కొడనాడు ఎస్టేట్ … చనిపోతున్నారా? చంపబడుతున్నారా?

Published on: Tue Jul 4, 2017 12:30PM

 

కొన్ని హారర్ సినిమాల్లో చనిపోయిన వారి ప్రేతాత్మ బతికున్న వార్ని వెంటాడుతూ వుంటుంది. అలాగే ఒక ఎస్టేటో, ఫామ్ హౌజో దెయ్యానికి టార్గెట్ గా వుంటుంది. అక్కడికి వచ్చిన వార్ని, అందులో పని చేసే వార్ని టైం టూ టైం ఖతమ్ చేసేస్తూ వుంటుంది! దివంగత జయలలిత కొడనాడు ఎస్టేట్ మిస్టరీ ఇలాగే తయారవుతోంది. పాపం అమ్మ జయలలితను మనం అనుమానించాల్సిన పని లేదు కాని… వరుసగా కొడనాడు ఎస్టేట్ తో లింక్ వున్న ఒక్కొక్కరూ మృత్యువాత పడుతున్నారు! అదే ఇప్పుడు తమిళనాడులో చర్చకు కారణం అవుతోంది!

 

జయలలిత మరణించిన కొద్ది రోజులకి చెన్నై మెరీనా బీచ్ లో జయ ఆత్మ కనిపించిందంటూ ఫేక్ వీడియోలు బయలుదేరాయి. అవన్నీ ఉట్టివేనని తేలిపోయింది కాని… జయ మరణం ఎఫెక్ట్ మాత్రం ఇంకా తగ్గటం లేదు! మరీ ముఖ్యంగా ఆమె కొడనాడు ఎస్టేట్ తో సంబంధం వున్న వారు ఒక్కొక్కరు మృతి చెందుతున్నారు. తాజాగా జయలలిత అకౌంటెంట్ దినేష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణం తీసుకున్నాడు! కారణాలు ఏంటో ఇంకా తెలియటం లేదట!

 

ఆత్మ చేసుకున్న జయలలిత అకౌంటెంట్ దినేష్ కుమార్ కొడనాడు ఎస్టేట్ లోనే పని చేసేవాడు. ఆదే ఎస్టేట్ లో ఆ మధ్య సెక్యూరిటీ గార్డ్ హత్యకి గురయ్యాడు. అతడ్ని దొంగతనానికి వచ్చిన దుండగులు మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసిన వారిలో కూడా మరొకరు అనుమానాస్పదంగా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. తరువాత ఇంకో దొంగ కూడా రోడ్డు యాక్సిడెంట్లోనే అనూహ్యంగా అంతమయ్యాడు! ఇలా ఇప్పుడు అకౌంటెంట్  మిస్టరీ డెత్ తో నాలుగో ప్రాణం పోయింది కొడనాడు ఎస్టేట్ ఖాతాలో!

 

జయలలిత మరణం తరువాత జరుగుతోన్న చావులకి ఆమె ఆత్మకి సంబంధం లేదని ఎవరైనా చెప్పేయోచ్చు. కాని,అసలు ఈ అనుమానాస్పద మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న! ఎస్టేట్ లోని ఆస్తులు, పత్రాలకి , మరణాలకి ఏమైనా సంబంధం వుందా అన్నది పోలీసులు తేల్చాలి! లేదంటే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదు!