జయలలిత మృతి కేసులో కొత్త ట్విస్ట్... సీసీ కెమెరాలను ఆఫ్ చేశారు..

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసులో ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారణలో భాగంగా శశికళ కూడా  ఆ రోజు ఏం జరిగింది... ఆ తరువాత ఏం జరిగిందో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. చెన్నై అపోలో ఆసుపత్రిలో జయ చేరిన తర్వాత ఐసీయూల సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జయ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన తర్వాత అక్కడి రోగులను ఇతర ఐసీయూలకు తరలించినట్టు చెప్పారు. 24 బెడ్‌లు ఉన్న ఐసీయూ మొత్తాన్ని ఆమెకే కేటాయించినట్టు చెప్పారు. ఆమెను ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతోనే సీసీ టీవీ కెమెరాలను స్వీచ్చాఫ్ చేసినట్టు వివరించారు. జయలలితకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను జస్టిస్ అర్ముగస్వామి కమిటీకి అందించినట్టు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.