నాలుగు నెలలలోనే అతి పెద్ద కుంభకోణం: ఎపి ప్రభుత్వం పై జనసేన సీరియస్
posted on Sep 21, 2019 5:24PM
ఎపి లో గ్రామ సచివాలయ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే జగన్ ప్రభుత్వం మాత్రం దీని పై నోరు మెదపడం లేదు. ఒక వైపు లీకేజి విషయమై ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా, తాజాగా జనసేన పార్టీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. "పారదర్శకతతో, నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించాం అని డైలాగులు చెప్పి భారీ కుంభకోణానికి తెర లేపిన జగన్ ప్రభుత్వం" అంటూ తీవ్ర వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. అది " గనులైనా, ఉద్యోగాలైనా కుంభకోణాల్లో రాటుదేలిన జగన్ టీం" అంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. దాదాపు 21 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడిన ఈ వ్యవహారం పై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోవడం మరింత అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది.