TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనసేనకి మద్దతు ఇచ్చిన జనాలకి థాంక్స్!

Published on: Sat Mar 14, 2015 2:48PM

 

రాజకీయాలలోకి హటాత్తుగా ప్రవేశించిన మెగాస్టార్ చిరంజీవిలాగే ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా అయోమయంలో ఉన్నట్లుంది. చిరంజీవికయితే తన ప్రజారాజ్యం ఎన్నికలలో గెలవాలి, గెలిచి తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని ఏలేయాలనే ఒక నిర్దిష్టమయిన పగటి కలయినా ఉండేది. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మాత్రం అటువంటిదేమీ లేకుండానే బరిలోకి దిగిపోయి తడబడుతున్నాడు. పార్టీని పెట్టింది అధికారం కోసం కాదు ప్రశ్నించడానికేనన్నాడు. పోనీ ప్రశ్నించడానికయినా మనిషి కనబడతాడా? అంటే అదీ లేదు.

 

అంత తీరిక లేకపోతే కనీసం ట్వీటర్ లోనయినా ఆ పని కానిచ్చేస్తుంటే ఆయన అభిమానులు కూడా ఎలాగో సర్దుకుపోయేవారు. కానీ దానికీ ఆయనకీ టైం ఉండటం లేదు. అంత బిజీ మనిషి మళ్ళీ ఉన్నట్లుండి తుళ్ళూరుకి వచ్చి ఒకరోజంతా వీరంగం ఆడేశాడు. ఆ తరువాత ఏమయిందో ఏమో గానీ అంతకు ముందు తిట్టిన నోటితోనే ప్రభుత్వాన్ని తెగ మెచ్చేసుకొని మాయమయిపోయాడు. పోతూపోతూ "జి.హెచ్.యం.సి ఎన్నికలలోనే మళ్ళీ నే..కనబడేది." అని ఓ చిన్న మాట అనేసి పోయాడు. అది పట్టుకొని అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. కానీ ఆ సంబరంలో అంతకు ముందు, తరువాత ఆయన చెప్పిన మాటలన్నీ మరిచిపోయారు.

 

మళ్ళీ ఇప్పుడు తాజాగా “జనసేనకు మద్దతు ఇచ్చిన జనాలకి థాంక్స్” అంటూ ఒక ట్వీటర్ మెసేజ్ ఒకటి పోస్ట్ చేసాడు. ‘అయితే అదేదో అప్పుడే చెప్పేస్తే బాగుండేది కదా?’ అని కొందరు గొణుకొంటుంటే, ‘మళ్ళీ వస్తానన్న పెద్దమనిషి, ప్రశ్నించడానికి ఎప్పుడు వస్తాడో చెప్పకుండా ఇలా ఇప్పుడు చల్లగా ‘థాంక్స్’ చెపుతున్నాడేమిటి?’ అంటూ మరికొందరు రుసరుసలాడుతున్నారు. అయితే ఇన్ని రోజుల తరువాత ‘అక్కలకీ, చెల్లెమ్మలకీ, అన్నలకీ, తమ్ముళ్ళకీ పేరుపేరునా జగన్మోహన్ రెడ్డి ఇస్టయిల్లో ఎందుకు ‘థాంక్స్’ చెప్పుకోవడం దేనికో ఆయనే వివరిస్తే బాగుండేది. తన వన్-మ్యాన్-ఆర్మీ జనసేన పార్టీకి జనాలు మద్దతు ఇస్తున్నారని గ్రహించినప్పుడు, ఇలా ఎక్కడో కూర్చొని వారికి థాంక్స్ మెసేజులు పెట్టడం కంటే ఆయన కూడా వచ్చి వారికి మద్దతు ఇస్తే బాగుండేది కదా? ఇప్పుడు ఎందుకు రాలేకపోయాడో మరో ఆరు నెలల తరువాత జనాల మధ్యకి వచ్చినపుడు చెపుతాడేమో.