జనసేన తెలుగుదేశంకు బలం కాదు బరువు
Published on: Thu Jun 9, 2022 11:44AM
ఏపీలో పొత్తుల పై రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులే కాదు.. సామాన్య జనంలో చర్చోపచర్చలూ జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాన్ ఆప్షన్లు అంటూ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో సామాన్య జనంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. అయితే ఈ చర్చల్లో జనసేనాని అప్షన్లపై ప్రజలలో అసహనం కనిపిస్తున్నది. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన మనోభీష్టంపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ ఒక రేంజ్ లో సాగుతోంది.
బలం ఏమిటో తెలియకుండా నేల విడిచి సాము చేయడంలా ఉంది ఆయన వైఖరి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలలో అయితే పవన్ ఆప్షన్లపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో బలమైన విపక్షంగా తెలుగుదేశం జనసేనను కానీ, జనసేన పార్టీని కానీ భుజాన మోయాల్సిన పని లేదని తెలుగుదేశం వర్గాలు విస్పష్టంగా చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వం అంటూ చేసిన ప్రకటన కారణంగానే ఆ పార్టీతో పొత్తు అన్న చర్చ తెరమీదకు వచ్చింది తప్ప.. తెలుగుదేశం పార్టీకి జనసేనానితో అంటకాగాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తెలుగుదేశం వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.
పొత్తు ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమన్న ధీమా ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధినేతను మోయాల్సిన అవసరం పార్టీకి లేదన్ని ఆ వర్గాలు కుండ బద్దలు కొడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్న జనసేన మాటల వెనుక వ్యూహం ఏమిటన్నది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన ఆకాంక్షను బయటపెట్టుకోవడంతోనే బహిర్గతమైపోయిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
ఆపరేషన్ టు డిస్ట్రాయ్ తెలుగుదేశం అన్నదే ఆ కుట్ర అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ పాలన పట్ల విసిగిపోయి ఉన్నారని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాకుండా, గత ఎన్నికలలో వైసీపీకి పడిన ఓట్లలో కూడా అధిక భాగం ఈ సారి తెలుగుదేశం కైవసం చేసుకంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పొత్తు అంటూ ముందుకు వచ్చి తెలుగుదేశం గెలిచే సీట్ల సంఖ్యను తగ్గించడమే జనసేన వ్యూహమని ఆ వర్గాలు అంటున్నాయి.
పొత్తులో భాగంగా ఓ 50 అసెంబ్లీ స్థానాలను జనసేన డిమాండ్ చేస్తుందనీ, ఆ పార్టీకి అన్ని సీట్లు గెలిచే సత్తా లేదనీ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులో వ్యూహమేమిటంటే తెలుగుదేశం గెలిచే స్థానాలను పరిమితం చేయడమేనని పేర్కొంటున్నారు. అధిక స్థానాలలో అదీ తెలుగుదేశం గెలిచే స్థానాలకు పట్టుబట్టడం ద్వారా వైసీపీ ఎక్కువ నియోజకవర్గాలలో గెలిచేందుకు సహకరించాలన్నదే జనసేనాని వ్యూహంగా కనిపిస్తోందని వివరిస్తున్నాయి. అందుకే జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకి భారమే అవుతుందని తెలుగు దేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.


