జనసేన పార్టీ పై ఒక్కగానొక్క ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్..
posted on Aug 11, 2020 5:29PM
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే. స్వయంగా రెండు నియోజకవర్గాలలో పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. ఐతే రాజోలు నుండి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మెల్లమెల్లగా సీఎం జగన్ ను కలుస్తూ వైసిపి కి బాగా దగ్గరయ్యారు. మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే అయన ముందుగానే వైసిపి నాయకుడు.. ఐతే ఎన్నికలలో ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో జనసేన టికెట్ తెచ్చుకుని గెలుపొందారు. ఐతే తాజాగా ఒక చోట మాట్లాడుతూ సొంత పార్టీ జనసేన పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
"అసలు అదో గాలి పార్టీ, అదేమైనా ఉండేది ఉందా..? స్వయంగా ఆయనే రెండుచోట్ల ఓడిపోయాడు, నాకు వైసీపీ టికెట్టు రాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి నిలబడ్డాను గానీ’’ అంటూ రెచ్చిపోయారు. ఇప్పటికే సీఎం జగన్ తో మంచి అనుబంధం ఉన్నందున అయన వైసిపి లో చేరిపోయినా పెద్దగా ఆయనకు న్యాయపరంగా వచ్చే చిక్కులేమి లేవని అంటున్నారు. మరో పక్క స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల మధ్య విభేదాలు పరిష్కరిస్తే.. అసెంబ్లీ వరకు వైసీపీలో జనసేన విలీనం కూడా సాధ్యమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.