సరిహద్దు ప్రాంతంలో ఆరుగురు ఉగ్రవాదులు హతం....

 

జమ్ముకశ్మీర్‌లోని యురీ సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే ఈ మొహ్మద్‌(జేఈఎం)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు యురీ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్ముకశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ వెల్లడించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు వైద్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.