TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యంపై దాడి.. తమిళనాడు సీఎం స్టాలిన్

Published on: Tue Mar 10, 2026 8:00AM

వన్ నేషన్ వన్ ఎలక్షన్  కరెక్ట్ కాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటోందని విమర్శించారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గిపోతుందని విమర్శించారు.   అదికారాలన్నీ కేంద్రం చేతుల్లోకే వెళ్లిపోతాయన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంటే  సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విఘాతమేనని స్టాలిన్ పేర్కొన్నారు. జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.   కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.  

ప్రస్తుత   సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నెల 20 వరకూ సాగే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమెదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల నిర్వహణను ప్రజాస్వామ్యంపై దాడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలూ దీనిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.  కాగా   మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ  లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరపాలన్న వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనపై గతంలో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.