షాకింగ్.. పుల్వామా తరహాలో మరో దాడి?

 

పుల్వామా దాడి.. ఆవేదన, ఆవేశం నుంచి బయటకి రాకముందే.. పుల్వామా తరహాలో మరోసారి దాడి చేసేందుకు జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భద్రతా బలగాలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులు ప్రవేశించే అవకాశం కూడా ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. జేఈఎం ఉగ్రవాదులు సోషల్ మీడియాలో పంపించుకున్న సందేశాలను డీకోడ్‌ చేయడంతో ఈ విషయం బయటపడినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా దాడి చేసేందుకు దాదాపు 500 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కశ్మీరీలను భద్రతా బలగాలు వేధించడం ఆపకపోతే దాడులు మరింత ఎక్కువ చేస్తామని సదరు ఉగ్రవాదులు హెచ్చరించినట్లు సమాచారం. ‘ఈ పోరాటం మీకు మాకు మధ్య. వచ్చి మాతో పోరాడండి. మేం సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ ఉన్న ఓ సందేశాన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు డీకోడ్‌ చేశాయి.