జైపాల్ రెడ్డి జోస్యం: మూడు వారాల్లో తెలంగాణ

 

 

 

ఫిబ్రవరి మూడో వారం లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రకటించారు. ఈలోగా తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేశామని గొప్పలు చెప్పడానికే పనికి వస్తుందని జైపాల్ రెడ్డి అన్నారు. శాసనసభ తీర్మానానికి బలం లేదు, పస లేదు అని ఆయన వ్యంగ్యోక్తి విసిరారు. మూజువాణి ఓటుతో తిరస్కరించడం పద్ధతి కాదంటూ రాజ్యాంగంలోని మూడవ అధికరణం ప్రకారం రాష్ట్రపతి అసెంబ్లీకి ఈ బిల్లును పంపించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయాక ఎటువంటి ఆందోళనలు ఉండవని చెబుతూ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో తెలంగాణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదు అని ఆయన భరోసా ఇచ్చారు. ఏకపక్ష ఐక్యత ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిలువునా చీలిపోయారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలలో వచ్చిన మార్పును దృష్టిలో ఉంచుకునే కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు.