జగన్ ఆమరణ నిరాహార దీక్ష
posted on Oct 4, 2013 2:40PM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాదులో తన పార్టీ కార్యాలయం ముందు రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రెండు నెలలుగా సీమంధ్ర ప్రజలుచేస్తున్న ఉద్యమాలను ఏ మాత్రం ఖాతరుచేయకుండా ‘మీ చావు మీరు చావండి’ అన్నట్లు రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికయినా రాజకీయాలకు అతీతంగా తెదేపా మరియు ఇతర పార్టీలన్నీ తమతో కలిసి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు; మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల మధ్య జలవనరుల ట్రిబ్యునల్స్ ఉన్నపటికీ ఆ రాష్ట్రాల మధ్య నీటి కోసం యుద్దాలు తప్పడం లేదని, ఇక ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోతే తెలుగు ప్రజలు ఒకరితో ఒకరు నీటి కోసం కొట్టుకొనే పరిస్థితి ఏర్పడుతుందని, అటువంటి పరిస్థితి రాకుండా నివారించాలంటే ఇప్పటికయినా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అయితే, అయన ఆమరణ నిరాహార దీక్ష చేప్పటడాన్ని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఆయన గొడవలు రెచ్చగొట్టి యుద్ధ వాతావరణం సృష్టించేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.