TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయమ్మకు 'జగనన్నకానుక'

Published on: Mon Mar 14, 2022 2:08PM

2009, సెప్టెంబర్ 2, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరెడ్డి ఆకస్మిక మృతి.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలుతో వైయస్ ఫ్యామిలీ ఓదార్పు యాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మోకాలడ్డడం... దీంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. 2011, మార్చి 12న తన తండ్రి పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం.. దీనికి అధ్యక్షుడిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టడం.. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఆయన తల్లి వైయస్ విజయమ్మని కూర్చోబెట్టడం.. ఆ తర్వాత వైయస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం.. జగనన్న వదిలిన బాణమంటూ ఆయన సోదరి వైయస్ షర్మిల జగన్న కోసం పాదయాత్ర చేయడం.. ఆ తర్వాత జగన్ బెయిల్‌పై విడుదల కావడం.. ఆ క్రమంలో జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికలకు జగన్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడం.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను... అధికార తెలుగుదేశం పార్టీ సంతలో పశువులు కొంటున్నట్లు కొంటున్నారంటూ ఆగ్రహించిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్.. అసెంబ్లీని బాయికాట్ చేసి మరీ పాదయాత్రకు శ్రీకారం చుట్టడం.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ బంపర్ మేజార్టీ సాధించి.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికార పీఠం ఎక్కడం ఇదంతా సినిమా రీల్ తిరిగినట్లు అంతా చకచకా జరిగిపోయాయి. 

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైయస్ జగన్, వైయస్ షర్మిల కొద్దిగా విశ్రాంతి అయినా తీసుకుని ఉండవచ్చు. కానీ  వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మాత్రం ఎక్కడా కంటి మీద కునుకు కూడా తీయలేదంటే అతిశయోక్తి కాదేమో. తన కుమారుడు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయండి.. అతడికి ఒక్క చాన్స్ ఇవ్వండి..  రాజన్న రాజ్యం తీసుకు వస్తాడంటూ ప్రజలను వేడుకున్నారు. ఇంకా చెప్పాలంటే... ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌ను అధికార పీఠం ఎక్కించేందుకు తల్లిగా వైయస్ విజయమ్మ అయితే ఓ విధంగా పెద్ద యజ్జమే చేశారని ఆ పార్టీలోని దాదాపు ప్రతి ఒక్కరు ఇప్పటికీ గుర్తు చేసుకొంటారు. ఎవరు అవునన్నా కాదన్నా.. వైయస్ జగన్ కోసం వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల పడిన కష్టం అందరికీ తెలిసిందే. కానీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవి నుంచి తొలగించాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ పదవిలో సీఎం వైయస్ జగన్.. తన సతీమణి వైయస్ భారతీని కూర్చోబెట్టాలని ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారని తాడేపల్లి ప్యాలెస్‌లో అంతర్గతంగా ఓ చర్చ అయితే నడుస్తోంది. మరికొద్దిరోజుల్లో దీనిపై ఓ ప్రకటన అయితే వెలువడనుందని తెలుస్తోంది.  

అయితే వైయస్ విజయమ్మను పార్టీ అధ్యక్షరాల పదవి నుంచి తొలగించడంపై తెలుగు ప్రజల్లోనే కాదు.. ఫ్యాన్ పార్టీలో సైతం ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని సమాచారం. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీకీ వైయస్ విజయమ్మ జీవం పోశారని? బిడ్డ వైయస్ జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె ఊరూరు తిరిగారని.. ఆ క్రమంలో ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని... అందులోభాగంగా ఆమె తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొన్నారని .. అయినా వాటికి వైయస్ విజయమ్మ ఎదురొడ్డి నిలవడమే కాకుండా.. వారి విమర్శలకు ఆమె అదరలేదు.. బెదరలేదన్నట్లు వ్యహరించడమేకాకుండా.. కష్టకాలంలో పార్టీకి వెన్ను దన్నుగా వైయస్ విజయమ్మ నిలిచారని ప్రజలంతా గుసగుసలాడుకొంటున్నారు. 

అయితే వైయస్ విజయమ్మే .. ఆ పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారా? లేక ఆమెను కావాలనే తప్పించారా? అనే ప్రశ్నలు అటు మీడియాలోనే కాదు.. ఇటు సోషల్ మీడియాలో సైతం వెల్లువెత్తాయి. ఈ విషయం ముందే గ్రహించిన వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు పక్క రాష్ట్రానికి వచ్చేసి పార్టీ పెట్టుకున్నారనే టాక్ కూడా అదే రేంజ్‌లో నడుస్తోంది. కన్న తల్లి వైయస్ విజయమ్మ పట్ల వైయస్ జగన్ ఇలా వ్యవహరించడం పట్ల .. ప్రజల్లో ఓ విధమైన సంకేతాలు వెళతాయని.. ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు సైతం పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగానే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఎక్కడ ఎటువంటి హాడావుడి లేకుండాపోయిందనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీ స్థాపించి ఈ ఏడాదికి 11 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్టీలో వేడుకలు లేవు.. కేడర్ లో ఊపు లేదు... లీడర్‌లో ఉత్సాహం లేదనే టాక్ అయితే రచ్చ రచ్చగా వైరల్ అవుతోంది. పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు.. కేడర్ నుంచి లీడర్ వరకు అందరిలో సంతోషం, హడావుడులు ఉండేవని కానీ నేడు ఆవి మాత్రం మచ్చుకైనా ఎక్కడ కనిపించడం లేదనే అభిప్రాయం ఫ్యాన్ పార్టీలోనే వ్యక్తమవుతోంది.