దొంగ ఓట్ల కోసమే జగన్ వలంటీర్లు .. జ్యోతుల నెహ్రూ
Published on: Fri Aug 5, 2022 12:11PM
వలంటీర్లపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తెలుగు దేశం శ్రేణులు చెబుతున్న మాటలనే జ్యోతుల నెహ్రూ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం విజయం ఖాయమనీ, అయతే వలంటీర్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనీ హెచ్చరించారు.
వచ్చే ఎన్నికలలో వలంటీర్ల దొంగ ఓట్లేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం కార్యకర్తలను హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆయమ మాట్లాడారు. జగన్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వలంటీర్లను నియమించినదే ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయడానికీ, వారితో దొంగ ఓట్లు వేయించుకోవడానికీ అని ఆరోపించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం మొదలైందన్న నెహ్రూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీ కార్యకర్తలు ఎవరూ అతి ధీమాతో ఉదాశీనంగా ఉండొద్దని హెచ్చరించారు. వలంటీర్లు దొంగ ఓట్లు వేయకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వలంటీర్లపై తెలుగుదేశం కార్యకర్తలు ఓకన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ రాష్ట్రంలో ప్రజలందరిపై నిఘా ఉంచి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేవారిని ఓట్లేయనీయకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నదని జ్యోతుల నెహ్రూ అన్నారు. వలంటీర్లతో దొంగ ఓట్లు వేయించే ప్రమాదం ఉందన్నారు. దీనిని అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. అలాగే మరింత జోరుగా పార్టీ సభ్యత్వం చేయించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.


