TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మతిమరుపు జనానికా.. జగన్ కా! పోలవరం నిర్వాసితులకు పరిహారం దక్కేనా?

Published on: Thu Jul 28, 2022 6:34AM

ప్రజలకు గతంలో తాను చెప్నిన మాటలు గుర్తుండవు అనుకున్నారో ఏమో జగన్ పోలవరం నిర్వాసితుల విషయంలో గతంలో మాట్లాడిన దానికి పొంతన లేకుండా మాట్లాడారు. వారికి మతిమరుపు ఎక్కువ అని ఆయన భావం అయి ఉంటుంది. అందుకే పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ఆర్ ( రిహెబిలిటేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) ప్యాకేజీ తన వల్ల కాదని చెప్పేశారు. కేంద్రమే ఇవ్వాలని కానీ కేంద్రం ఇవ్వడం లేదనీ నెపం కేంద్రం మీదకు నెట్టేశారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటే 20 వేల కోట్లు అవసరం అవుతుందని, అది కేంద్రం ఇవ్వాలే కానీ తన వల్ల ఎలా అవుతుందని బీద అరుపులు అరిచారు. పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన విషయాలివి. అయితే గతంలో అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడిన విషయాన్ని పోలవరం నిర్వాసితులు గుర్తు చేస్తున్నారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు కేంద్రం ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు ఆ ఆర్థిక ప్యాకేజీలో ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీని కూడా ఆ ఆర్థిక ప్యాకేజీలో చేర్చారు. అంతే వంద శాతం ప్రాజెక్టు వ్యయం కేంద్రమే భరించేలా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే అప్పట్లో విపక్ష నేత హోదాలో జగన్ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.అంచనాలు పెంచడాన్ని జగన్ గట్టిగా వ్యతిరేకించారు. చంద్రబాబు అవినీతి కోసమే అంచనాలు భారీగా పెంచేశారని విమర్శలు గుప్పించారు.

ఇదే విషయాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఫిర్యాదుల ఆధారంగానే కేంద్రం అంచనాలను తగ్గించేసింది. ఆర్ఆర్ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. గతంలో అంటే జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది వేలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పది లక్షల సంగతి మరిచిపోయి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు ఐదు లక్షలంటూ చెబుతున్నారు. తీసుకున్న అప్పుల లెక్కలు మార్చేసినట్లుగానే హామీ ఇచ్చిన పది లక్షలను వదిలేసి తానిచ్చిన హామీ ఐదులక్షలే అని చెప్పడానికి ఇసుమంతైనా సంకోచించడం లేదు.

జగన్ వైఖరిని పరిశీలకులు తప్పుపడుతున్నారు. జగన్ తన తీరుతో పోలవరం ప్రాజెక్టునూ, పోలవరం నిర్వాసితులనూ నిండా ముంచేశారని విమర్శిస్తున్నారు. ఇక జగన్ వ్యాఖ్యలు కేంద్రాన్నీ ఇరుకున పెట్టాయి. పోలవరం అంచనాల పెంపు వెనుక భారీ అవినీతి ఉందని, అంచనాలు పెంచవద్దని జగన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అంచనాలను తగ్గించేశామని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు అదే జగన్ కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని కేంద్రంపై ఆరోపణలు చేయడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులకు జగన్ గతంలో చేసిన ప్రసంగాల, అప్పటి చంద్రబాబు సర్కార్ పై పోలవరం అవినీతిపై చేసిన విమర్శలను ప్రజలలోకి తీసుకువెళ్లి జగన్ వైఖరిని ఎండగట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.