TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందులలో ప్రజలకు కనిపించకుండా పరదాలు.. కోనసీమలో వరద కష్టాలను కప్పేయడానికి తెరలు!

Published on: Mon Jul 25, 2022 7:12AM

ఏ నాయకుడైనా ప్రజలకు ఎప్పుడు ముఖం చాటేస్తాడు. ప్రజలలో తన పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసినప్పుడు. అని వార్యంగా ప్రజల ముందుకు రావలసినప్పుడు అధికారంలో ఉన్న నాయకుడైతే తనను వ్యతిరేకించే వర్గాన్ని నిర్బంధించి.. తన అనుకూల వర్గాలను చుట్టూ పెట్టుకుని జేజేలు కొట్టించుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు విధానాలనూ ఇప్పటికే ఉపయోగించేశారు. నెలల తరబడి ప్యాలెస్ దాటి జనంలోకి రాకుండా ఉండటమూ అయిపోయింది. పులివెందుల పర్యటనలో జనం ఆయనకు సమీపంలోకి రాకుండా బ్యారికేడ్లు పెట్టడమూ అయిపోయింది. ఇప్పుడాయన విపక్షాల విమర్శల కారణంగా అనివార్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వెళుతున్నారు. మంగళవారం (జులై 26)న ఆయన కోనసీమ జిల్లాలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ పక్కాగా ఖరారైపోయింది. ఆయన పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లూ చేసేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు ఏర్పాట్లేమిటంటారా? ఉంటాయి. రాజుగారు ప్రజల అవస్థలను చూడలేరు. అందుకు అవేమీ ఆయనకు కనిపించకుండా తెరలు కట్టేయడమే ఏర్పాట్లన్న మాట. తెరల మాటున వరద నష్టాన్ని, బాధితుల ఇబ్బందుల్నీ కప్పేసిన తరువాత తీరికగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారన్న మాట. అంతా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ప్రకటనో, ప్రసంగమో, లేదా మీడియా సమావేశంలోనో చెప్పేసి తన భుజాలను తానే చరిచేసుకుని పర్యటన ముగిస్తారన్న మాట.

నాయకుడు బాధితులతో మమేకం అవ్వాలి. కష్టాల్లో ఆదుకుంటానన్న భరోసా ఇవ్వాలి. వరద ముంపులో ఉన్న సమయంలోనే వారి దగ్గరకు వెళ్లాలి. ముంపు బాధలను ప్రత్యక్షంగా చూడాలి. అందుకు భిన్నంగా వదర నీటిలో జనం నిండా మునిగి ఉన్న సమయంలో ఏరియల్ వ్యూ అంటూ గాలిలో తిరిగి వెళ్లిపోయిన జగన్.. అసందర్బంగా వివిధ శాఖల సమీక్షలు నిర్వహించారే తప్ప వరద బాధితుల కష్టాల గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు విపక్ష నేత వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి వరదలోనే ముంపు బాధితులకు కలిసి వారికి భరోసా ఇచ్చి వచ్చిన తరువాత అనివార్యంగా జగన్ పర్యటనకు బయలు దేరుతున్నారు.  

అది కూడా వరద తీసేసిన తరువాత. అది కూడా వదర ఛాయలు కూడా జగన్ కు కనిపించకుండా అధికారలు తెరలతో కప్పేసిన తరువాత. భారీ నష్టం జరగలేదని చెప్పడానికి ఏం చేయాలో అన్నీ అధికారులు చేసేసిన తరువాత.   వరద బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే..  వరద బాధితులను తాము బ్రహ్మాండంగా ఆదుకున్నాం.. వారికి కష్టమనేది తెలియకుండా అన్ని చర్యలూ తీసుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో విపక్ష నేత పర్యటనపై విమర్శలు గుప్పించింది. అసలాయన ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారంటూ నిలదీసింది.

ఆయన పర్యటన వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందంటూ దుయ్యబట్టింది. వాస్తవంలో వరద బాధితులను గోదారికి వదిలేసిందన్న బాధితుల ఆగ్రహాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో జగన్ కోనసీమలో పర్యటించి తెరల వెనుక ఉన్న కష్టాన్ని, నష్టాన్ని చూడకుండా తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేసిందనీ, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుందనీ చెప్పడానికి ఒక రోజు పర్యటనకు రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లు పర్యటించేస్తారన్నమాట.