కాంగ్రెస్ కి దత్తపుత్రుడి అండ
posted on Oct 18, 2013 11:06AM
కాంగ్రెస్ అధిష్టానంపై విజయవాడ ఎంపీ లగడపాటి విమర్శలు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దత్తత పుత్రుడని అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి అండ చూసుకునే సొంతపార్టీ నాయకులను అరువు పుత్రులుగానూ, బరువు పుత్రులుగానూ భావిస్తోందని తప్పుపట్టారు.
ఇంక కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా, ఎంత గోల చేసినా, కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ దత్తపుత్రుడు ఎవరని ప్రశ్నించగా.. 'ఆ దత్తపుత్రుడు పాతపుత్రుడో.. కొత్త పుత్రుడో కానీ రాష్ట్రాన్నే పణంగా పెట్టి పదవుల్ని పొందాలని చూస్తున్న పుత్రుడు' అని ఘాటుగా విమర్శించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కనుక లాలూచీ పడితే కేంద్ర మంత్రి, గవర్నర్ వంటి పదవుల్ని పొందొచ్చని.. కానీ రాష్ట్రం సమై క్యత కోసం అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురిస్తూ ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు. పదవిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడి సమై క్యం కోసం సీఎం పోరాడుతుంటే.. దత్తపుత్రుడు మాత్రం పదవి కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడని విమర్శించారు.