TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతిపక్ష హోదాపై జగన్ వెనకడుగు?

Published on: Mon Feb 2, 2026 10:21AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన మంకుపట్టు వీడనున్నారా? ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరౌతాను అన్న పంతం వీడి ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా అంటే వైసీపీ శ్రేణుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పాకులాడి పరువు పోగొట్టుకోవడం కంటే.. పంతం వీడి అసెంబ్లీకి హాజరు కావడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు కనిపిస్తోంది.

అయితే ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ వెనకడుగు వేయడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలు స‌భ‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని, భ‌త్యాల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌ని.. స్పీక‌ర్ అయ్య‌న్న బాహాటంగా చెప్పడమే కాకుండా, సభకు గైర్హాజర్ అయ్యే ఎమ్మెల్యేల వేతనాల్లో కోత పెట్టడమే కా కుండా, వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు భయంతో పాటు.. ఇంకా అసెంబ్లీ బహిష్కరణ అంటే పార్టీ ఎమ్మెల్యేలు తన మాట వినకపోవచ్చన్న ఆందోళన కూడా జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో తన వైఖరి మార్చుకోవడానికి కారణం కావచ్చని పరిశీలకులు అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14న అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు.  ఈ నేపథ్యంలోనే  వైసీపీ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   గ‌త 18 నెలలుగా వైసీపీ నాయకులు అసెంబ్లీకి గైర్హాజరౌతున్న సంగతి తెలిసిందే.  శాస‌న స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు స‌భ‌కు వచ్చారు. ఆ తరువాత   2025-26 బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజున, గ‌వ‌ర్నర్ ప్ర‌సంగానికి జ‌గ‌న్ తన ఎమ్మెల్యేల‌తో హాజ‌ర‌య్యారు. ఆ సందర్భంగా  న‌ల్ల‌కండువాల‌తో  స‌భ‌కు వ‌చ్చిన వైసీపీ సభ్యులు..   గ‌వ‌ర్న‌ర్  ప్ర‌సంగ ప్ర‌తుల‌ను చింపేసి వాకౌట్  చేశారు.  ఆ తరువాత వైసీపీ సభ్యులెవరూ ఇంత వరకూ అసెంబ్లీకి హాజరైంది లేదు.  అయితే ఇప్పుడు సభ్వత్వాలను కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి హాజరు కావాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అయితే పూర్తి బడ్జెట్ సెషన్ కు కాకుండా, ఉభయ సభలను ఉద్దేశించి చేసే గవర్నర్ ప్రసంగానికి హాజరై నిరసన వ్యక్తం చేసి, సభ నుంచి వాకౌట్ చేయాలన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అలా చేయడం ద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.