TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ నోట మళ్లీ మావిగన్.. మళ్లీ నెట్టింట ట్రోలింగ్

Published on: Wed Apr 8, 2026 4:39PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రా మావిగన్  మంత్రాన్ని మరోసారి జపించారు. ఈ సారి ఆయన  పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన మావిగన్ ప్రతిపాదనను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి అభివృద్ధి చేస్తే అమరావతిపై రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చిలక్కి చెప్పినట్లు చెప్పానని కూడా జగన్ చెప్పుకున్నారు. 

మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.  

అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా, మరో రెండు దశాబ్దాల వరకు అది పూర్తిస్థాయి రాజధానిగా మారే అవకాశం లేదంటున్న జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల మూడుముక్కలాట వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఏం సమాధానం చెబుతారో చూడాలి. అమరావతి కోసం వెచ్చించే రెండు లక్షల కోట్ల రూపాయలలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మావిగన్ మొదటి రోజు నుంచే రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో నెటిజనులు రుషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని మావిగన్ కోసం ఎందుకు వెచ్చించలేకపోయారని నిలదీస్తున్నారు.  

ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిన జగన్, ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన తీసుకురావడం హాస్యాస్పదమని తెలుగుదేశం విమర్శలతో విరుచుకు పడుతోంది.  రాజధానిగా  అమరావతికి చట్టబద్ధత లభించి.. ఆర్థికాభివృద్ధి జోరుగా సాగుతున్న తరుణంలో  ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ఇలా వితండ వాదం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.