జగన్ మీద టీడీపీ సభాహక్కుల నోటీసు...టీడీపీకి జగన్ చురకలు

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రచ్చ రేపుతున్నాయి. సున్నా వడ్డీ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ పై శాసనసభలో టీడీపీ సభాహక్కుల నోటీసు ఇచ్చింది. సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చలో తమపై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకే నోటీసు ఇస్తున్నామని టీడీపీ తెలిపింది. 

అసత్యాలు మాట్లాడి, సభను పక్కదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఇచ్చిన నోటీసులో టీడీపీ పేర్కొంది. ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చను కొనసాగించాలని, తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో దీనికి అనుమతించేది లేదని, పైగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి వుందని, మరో రూపంలో నోటీసులు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. 

వారు నినాదాలు చేస్తున్న వేళ, సభా నాయకుడు, సీఎం వైఎస్ జగన్ మైక్ ను తీసుకుని, నిన్నటి చర్చను పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబునాయుడు ఏం చెప్పదలచుకున్నారో చెప్పవచ్చని అన్నారు. తమ వద్ద అన్ని గణాంకాలూ సిద్ధంగా ఉన్నాయని, సభలో మరికాసేపు అదే అంశంపై చర్చ జరిగితే ప్రజలు కూడా చూస్తారని అంటూ టీడీపీకి చురకలు అంటించారు. కాగా, ఇలా ముగిసిన అంశాన్ని తిరిగి తోడటం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, ముఖ్యమంత్రి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని మరోసారి సమయం ఇస్తానని స్పీకర్ చెప్పారు.