ఆర్భాటంగా ప్రకటనలు.. అమలు చేయలేక ఆపసోపాలు!
Published on: Tue Nov 1, 2022 12:12PM
జగన్ ముఖ్యమంత్రి ఈ మూడున్నరేళ్లలో చేసినది ఆర్భాటంగా నిర్ణయాలు తీసుకోవడం.. వాటి పర్యవసానాలు ఎదుర్కోలేక అభాసుపాలై ఆపసోపాలు పడటం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా వేదికను కూల్చడంతో మొదలైన జగన్ విధ్వంస పాలన మూడేళ్లుగా ఎన్నో మొట్టికాయలు తిన్నా అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది. అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికనైతే కూల్చేశారు కానీ.. ఆ ప్రజా వేదిక అక్రమకట్టడం అని ఇప్పటి వరకూ అక్రమకట్టడం అని నిరూపించడం అయితే కాలేదు.
ముందు కానిచ్చేస్తే.. ఆ తరువాత ఏం జరిగినా ఎవరూ పీకేదేం లేదన్న విధానంతో జగన్ సర్కార్ ముందుకు పోతోందని అంటున్నారు. రిషికొండ తవ్వకాల విషయంలో కూడా జగన్ సర్కార్ అదే తీరును అవలంబిస్తోందని గుర్తు చేస్తున్నారు. కోర్టు కూడదన్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగించడం.. పర్యావరణ విధ్వంసానికి వెనుకాడకపోవడాన్ని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు ఉదహరిస్తున్నాయి. అడవుల విధ్వంసంపై న్యాయస్థానం కన్నెర్ర చేస్తే ధ్వంసం చేసిన అడవుల స్థానంలో మళ్లీ అడవిని పెంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పడాన్ని తెంపరితనంగా అభివర్ణిస్తున్నారు.
విధ్వంసం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయని జగన్.. ప్రభుత్వ నిర్ణయాల అమలు విషయంలో మాత్రం ప్రతిసారీ మడమ తిప్పుతున్నారు.. మాట తప్పుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖలో ఫ్లెక్సీల పై నిషేధం అంటున్నారు. ఇటీవల జగన్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖలో అపరిమితంగా అడ్డూ అదుపూ లేకుండా వెలసిన ఫెక్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఊరుకోకుండా తక్షణమే విశాఖలో ఫ్లెక్సీలపై నిషేధాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు.
ఈ తక్షణం ఇప్పటి వరకూ రాలేదు. నవంబర్ 1 లోగా ఫెక్సీలపై నిషేధం ఉత్తర్వులు ఇస్తామని ఒకసారి.. ఆ తేదీ వచ్చేసరికి నిషేధం జనవరి నుంచి అంటూ మరోసారి మడమ తిప్పేసి మాట మార్చేశారు
జగన్. ముందు చూపు లేకుండా నిర్ణయాలు ప్రకటించడం.. ఆ తరువాత మిన్నకుండిపోవడం ఒక అలవాటుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్నది. అప్పటికప్పుడు నోటికి తోచిన ప్రకటన చేయడం... ఆ ప్రకటన ప్రకారం చర్యలు తీసుకోలేక, కార్యాచరణలో పెట్టలేక అభాసుపాలు కావడం.. మాట మార్చడానికి ఆపసోపాలు పడటం ఇదే మూడున్నరేళ్లుగా జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానమంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


