జగన్ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే మీడియా
Published on: Wed May 9, 2012 6:17PM
వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మీడియాను వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, దేవేందర్ గౌడ్ విమర్శించారు. సాక్షి మీడియా బ్యాంకు ఖాతాల స్తంభనకు పత్రికా స్వేచ్ఛకు సంబంధం లేదని వారు చెప్పారు. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడమే కాదు, జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అన్ని విషయాల్లో అందరినీ మోసం చేస్తామని అనుకుంటే కుదరదని వారు అభిప్రాయపడ్డారు. సాక్షి మీడియా ద్వారా తప్పుడు కథనాలు కథలు కథలుగా రాస్తున్నారని వారన్నారు. సిబిఐ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని వారన్నారు. ప్రజాధనం దోపిడీ చేయడం ప్రారంభించినప్పుడే అరికట్టి ఉంటే బాగుండేదని వారన్నారు. ఉప ఎన్నికలకు వైయస్ జగన్ మీడియా బ్యాంకు ఖాతాల స్తంభనకు సంబంధం లేదని, అలా అనుకుంటే దౌర్భాగ్యమేనని వారన్నారు. ఉప ఎన్నికల్లో అవినీతి ఎజెండానే అని వారన్నారు.


