TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనాలకు కనిపించరు సరే.. ఎమ్మెల్యేలకూ మొహం చాటేస్తారా?

Published on: Thu Jun 9, 2022 2:35PM

వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ దర్శనం గగనమేనా?  తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకోవాలనుకున్నా, ఇతర సమస్యల గురించి చర్చించాలనుకున్నా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకడం దుర్లభమా?  అంటే తాజా మాజీ మంత్రి పేర్ని నాని మాటలు వింటే నిజమేనన పించక మానదు.   బుధవారం సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలు నోరు విప్పి, తమ గోడు వినిపించడం విశేషం. ఇప్పటి వరకు కేవలం పార్టీ అధినేత జగన్ చెప్పిన మాటలకు జీ హుజూర్ అంటూ తలొగ్గిన ఒక్కొక్కరూ ఇప్పుడు నోరు మెదిపేందుకు సాహసిస్తున్నారనడానికి బుధవారం జరిగిన వర్క్ షాపే నిదర్శనం.
మాజీ మంత్రి పేర్ని నాని మాటల ప్రకారం చూస్తే.. వైసీపీ నేతలు ఎవర్నీ కూడా జగన్ దరికి రానివ్వడం లేదనేది స్పష్టం అవుతోంది. ప్రతి అంశానికీ సలహాదారుల్నే నమ్మడం, వారు చెప్పిందే వినడం, చేయడం తప్పిస్తే.. వాస్తవ పరిస్థితులను ప్రజా ప్రతినిధుల నోటి నుంచి వినేందుకు ఏమాత్రం జగన్ ఇష్టపడడం లేదని చెబుతున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా సమయం కేటాయించకపోయినా.. కనీసం ద్వారం వద్దకు వచ్చి అయినా దర్శనం ఇస్తే.. ఒక్కోసారి కనీసం 20 మంది ఎమ్మెల్యేలు సీఎంను కలుసుకునే అవకాశం ఉంటుందని పేర్ని నాని చెప్పడంలోని వాస్తవాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు. గతంలో జగన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ద్వార దర్శనం ద్వారా ఎమ్మెల్యేలను పలకరించేవారని, ఆ విధానం అయినా కొనసాగిస్తే మంచిదని పేర్ని నాని జగన్ కు సూచించారు.

జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గొంతు విప్పి మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లినప్పుడు జనం తమను ముఖం మీదే మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ , పొలాలకు దారుల గురించి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, వారి ఆగ్రహాన్ని చల్లార్చడం తమ వల్ల కావడం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

ఇక వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన నియోజకవర్గాల సమస్యల విషయానికి వస్తే..  రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయి. బోర్లు వేయించుకుంటామంటే విద్యుత్ శాఖ నుంచి మెటీరియల్ సకాలంలో ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారని, ఇసుక సమస్య కూడా ఉందని, ఇసుక డిపోల సంఖ్య పెంచాలని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గడప గడపకు కార్యక్రంలో మంచినీళ్ల కోసం ప్రజలు, పొలాలకు వెళ్లేందుకు దారులు నిర్మించాలని రైతులు అడుగుతున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు కొనుక్కున్న ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వాపోయారు. ఇలా తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకునేందుకు కూడా సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదనే అసంతృప్తి వైసీపీ ప్రజాప్రతినిధుల్లో నివురుగప్పిన నిప్పులా మారిందంటున్నారు.

అయితే.. ఎమ్మెల్యేలకు సమయం ఇస్తుంటే.. ఒక్కొక్కరూ అరగంటకు పైగా మాట్లాతున్నారని, అలా అయితే.. ఎక్కువ మందితో మాట్లాడడం సాధ్యమయ్యే పనేనా? అని జగన్ అన్నారట. అందుకే కనీసం మీ తండ్రి మాదిరిగా ఒక్కోసారి 20 మంది ఎమ్మెల్యేలకైనా ద్వార దర్శనం కల్పించండి మహప్రభో అని పేర్ని నాని వాపోయారని సమాచారం. జనంలోకి ఎలాగూ రాని జగన్ కనీసం తన పార్టీ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకైనా ముఖం చూపిస్తారో లేదో వేచిచూడాలి మరి?!