TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ నెల్లూరు పర్యటన రద్దు.. కాకాణికి అధినేత పరామర్శ లేనట్టేనా?!

Published on: Wed Jul 2, 2025 10:32AM

మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రద్దైంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించేందుకు జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పుడా పరామర్శ  యాత్ర రద్దు చేసుకున్నారు.  నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు  గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు పర్యటన తలపెట్టిన విషయం విదితమే. ప్రభుత్వం హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ చెబుతోంది.   

కానీ హెలిప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోయినా కూడా  జగన్ పర్యటన కొనసాగి తీరుతుందంటూ వైసీపీ నేతలు మీడియాముందుకు వచ్చి ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తొడగొట్టి మీసం మెలేసే అలవాటు ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే.. మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ పర్యటన ఆగదు, మా ప్లాన్లు మాకున్నాయి.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ నెల్లూరు వచ్చి తీరుతారు, కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శిస్తారంటూ తొడగొట్టి చెప్పారు.  అయితే జగన్ మాత్రం తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక కాకాణి పరామర్శకు ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. సరే అనువైన పరిస్థితులు లేవు కనుక హెలీప్యాడ్ కు స్థలం దొరకలేదు.. కానీ రోడ్డు మార్గాన వచ్చే ఆప్షన్ ను  వైసీపీ కనీసం పరిశీలించను కూడా పరిశీలించకపోవడానికి కారణ మేంటన్నది ఆ పార్టీ నేతలే చెప్పాలని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తారంటూ తొడకొట్టి మరీ చెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.  అసలింతకీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టైన ఇన్నాళ్లకు జగన్ ఆయనను పరామర్శించాలని ఎందుకు తలపోశారు. ఇన్ని రోజులూ ఎందుకు పరామర్శకు రాలేదు అన్న ప్రశ్నకు కూడా వైసీపీ బదులు చెప్పాల్సి ఉంటుంది.