సర్కార్ కు తోచదు..విపక్షం చేస్తే నచ్చదు!
Published on: Fri Jun 10, 2022 12:15PM
అమ్మ పెట్టా పెట్టదు..అడుక్కు తినా నివ్వదు అన్నది సామెత. ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరు సరిగ్గా సరిగ్గా ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఔను నిజమే.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితతి ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదన్నట్లుగా ఉంది. ప్రభుత్వం ధరల అదుపు బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది. ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్ని వస్తువుల ధరలూ పెంచేస్తూ..పేద వారి బతుకును దుర్లభం చేసేసింది వైసీపీ సర్కార్. ఇదుదొ విపక్షం విమర్శ కాదు. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ సాక్షాత్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రతి గడపలోనూ వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురైన ప్రశ్న. ఆ ప్రశ్నలలోనే వేడినీ, వేదననూ గమనించి ప్రభుత్వమే పేదలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాల్సింది పోయివిపక్ష తెలుగుదేశం పేదలకు చవకగా పట్టెడన్న పెట్టేందుకు ప్రయత్నించడాన్ని సహించ లేకపోతోంది. అన్న క్యాంటిన్ ఏర్పాటు చేసి పేదలకు రెండు రూపాయలకే రుచికరమైన భోజనం అందించాలన్న సదాశయాన్ని మొగ్గలోనే తుంచేసింది. మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటిన్ ను జేసీబీలతో కూల్చేశారు పోలీసులు. అందుకు వారు చెప్పిన కారణం అన్న క్యాంటిన్ ఏర్పాటుకు అనుమతి లేదు అని. అయితే వైసీపీ ప్రభుత్వ తీరును మంగళగిరి స్థానికులు సైతం తీవ్రంగా గర్హిస్తున్నారు. అన్న క్యాంటిన్ ను కూల్చివేయడం అమానుషమనీ, దారుణమనీ అంటున్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి ప్రయత్నించడం కూడా తప్పేనా అని నిలదీస్తున్నారు. అనుమతి లేకపోతే ఇవ్వోచ్చుగా అని సలహా కూడా ఇస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లు పేదలకు ఎంతో సేవ చేశారని, శుభ్రమైన, శుచికరమైన, రుచికరమైన బోజనం చవుకగా అందించాయనీ వారు గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తూనే అన్న క్యాంటిన్లను రద్దు చేసి పేదవాడి నోటి కాడ కూడును లాగేసుకుందని విమర్శించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను కూల్చివేసి పేదల నోటి కాడ కూడు లాగేయడంపై వైసీపీ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్న క్యాంటిన్ కూల్చివేతను అడ్డుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలన పోలీసులు అరెస్టు చేశారు. అయినా తగ్గేదే లే అంటూ తెలుగు తమ్ముళ్లు శపథం చేశారు.
అన్న క్యాంటిన్ ఏర్పాటును అడ్డుకోవడానికి జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా, పోలీసులను ప్రయోగించినా మంళళగిరిలో అన్న క్యాంటిన్ ఏర్నాటు చేసి రెండు రూపాయలకే పేదలకు భోజనం అందిస్తామని ఎవడడ్డోస్తాడో చూస్తామని తెలుగు తమ్ముళ్లు సవాల్ చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు అన్న క్యాంటిన్ కూల్చివేతను తీవ్రంగా విమర్శించారు.
పేదలకోసం చేస్తున్న ఒక మంచి ప్రయత్నాన్ని రాజకీయ కారణాలతో ప్రభుత్వం అడ్డుకోవడం విడ్డూరమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనిని చేయకపోగా, విపక్షం పేదలను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చెడగొట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.


