TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రతిమించిన జగన్ విమర్శలు.. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు

Published on: Thu May 21, 2026 4:49PM

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. రాజకీయ విమర్శల వరకూ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ అవి వ్యక్తిగత స్థాయికి దిగజారడం ఎంత మాత్రం సరికాదు. అయితే ఏపీలో వైసీపీ అధినేత జగన్ మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే విషయంలో మాత్రం పదే పదే గీత దాటుతున్నారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలు, శాపనార్ధాలతో శ్రుతి మించుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేసినా మాజీ సీఎం జగన్ మాత్రం తన అనుచిత వ్యాఖ్యలతో నిత్యం విమర్శలను ఎదుర్కొనే పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా గురువారం (మే 21) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మరో సారి చంద్రబాబుపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు గుండే ఆగి చనిపోతారు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రుపుతున్నాయి.  చంద్రబాబు ఆరోగ్యం, మరణం గురించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

ఇటీవల వైఎస్ జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని అంశంపై సోషల్ మీడియాలో  జగన్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యారు.  ఈ నేపథ్యంలోనే గురువారం మీడియాతో మాట్లాడిన జగన్.. మావిగన్ అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. అయితే ఈ సారి  మాత్రం ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, ఆయన మరణం గురించి మాట్లాడడానికి కూడా ఇసుమంతైనా వెనుకాడ లేదు.  ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతున్న సమ యంలో ఎవరైనా పొరపాటున ఆయన చెవిలో 'మవిగన్' అని పలికితే, ఆయనకు గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ పేరు వింటేనే చంద్రబాబుకు రక్తపోటు (బీపీ)   పెరిగిపోతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి..  తోటి సీనియర్ నాయకుడి పట్ల ఇలాంటి భాషను ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సాధారణంగా దక్షిణ భారత రాజకీయాల్లో పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ, జగన్ మాత్రం చంద్రబాబు వయసును, ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్  ఈ వ్యాఖ్యల ద్వారా తన నైతిక దిగజారుడుతన్నాన్ని చాటుకున్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఇటువంటి వ్యక్తిగత విమర్శలు, కక్షసాధింపు ధోరణిని  రాష్ట్ర ప్రజలు తిరస్కరించినప్పటికీ.. ఆయన ధోరణిలో ఇసుమంతైనా మార్పు రాలేదంటున్నారు.