TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయ వైకుంఠపాళీలో దిగజారిన జగన్

Published on: Sat Jul 9, 2022 4:55PM

ఏద‌యినా శుభ‌కార్యం ఆనందోత్సాహాల‌తోనే ఆరంభ‌మ‌వుతుంది, ముగుస్తుంది. సినిమా ఆరంభం, పార్టీ ఆరంభం, సెంచ‌రీ కొట్టిన సినిమా ఉత్స‌వం, ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ విజ‌యాలు నెమ‌రేసుకునే కార్య‌క్ర‌మం.. ఇలా అన్నీ హ్యాపీ నోట్‌తోనే జ‌రుగుతాయి. కానీ, క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వైసీపీ ప్లీన‌రీ పాత సినిమాలోలా ఏడుపు స‌న్నివేశంతోనే ఆరంభ‌మ‌యింది. అదీ పార్టీ అధినేత ఆంధ్ర‌ప్ర‌దేశ్  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి గౌర‌వ అధక్షురాల‌న్న ప‌ద‌వి నుంచి దించేసిన ఘ‌ట్టంతో ప్లీన‌రీకి వ‌చ్చిన వారు పైకీ, కొందరూ లోలోప‌ల  ఇంకొందరు బాధ‌ప‌డ్డారు. కానీ ప్ర‌జ‌లు, విప‌క్షాలు మాత్రం ఈ మొత్తం హ‌డావుడితో వైసీపీ నిజ‌రూపం బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు. త‌ల్లితో రాజీనామా చేయ‌డం పార్టీలో రాజీనామాల శ‌కం ఆరంభానికి నాందిగా విశ్లేష‌కులు అంటున్నారు. 
వై.ఎస్ మ‌ర‌ణానంత‌రం  జ‌గ‌న్ వైసీపీ పార్టీ తో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుని ప్ర‌జారంజ‌కంగా ప‌రిపాలిస్తారని అంద‌రూ అనుకున్నారు. కానీ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లు, ప్ర‌చారాల హ‌డావుడిలో చెప్పిన‌వ‌న్నీ  గాలికి వ‌దిలేశారు. త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం త‌ల్లిని గౌర‌వ అధ్య‌క్షురాలిని చేసి పార్టీ వీరాభిమానుల అండతో  అధికార అందలం అందుకున్నారు.  అయితే మాట‌లు చెప్పి పాల‌న సాగించ‌డం ఆట్టే కాలం సాగ‌దు. విప‌క్షాల మీద ఎగిరిప‌డ‌టం, అనుభ‌వ‌రాహిత్యంతో క‌బుర్లు చెప్పి, ప‌థ‌కాల పేరుతో అన్ని వ‌ర్గాల‌వారినీ ఆక‌ట్టుకోవ‌డానికి చేసిన యత్నాలు ఆట్లే కాలం ఫలితాలనివ్వడు.

 క్ర‌మేపీ జ‌గ‌న్ తంత్రాల‌న్నీ బెడ‌సికొట్టాయి. అన్ని త‌న‌ను కాపాడుకునే మార్గాలకు మెట్లు వేసుకోవడమే త‌ప్ప  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను, సంక్షేమాన్ని ప‌ట్టించుకునే త‌త్వం ఆయ‌న‌లో లేద‌న్న‌ది అర్ధ‌మ‌యింది. మూడేళ్ల పాల‌న ముగిశాక చేసిన‌ దేమిటి, జ‌రిగిన‌దేమిటి అని పార్టీ వ‌ర్గాలే బేరీజు వేసుకునే పరిస్థితి వచ్చింది.  పార్టీలోనూ, బ‌య‌టా వారికి  గౌర‌వం సన్న‌గిల్లింద‌ని, జీ హుజూర్ అంటూ బ‌త‌కాల్సి వ‌స్తుంద‌న్న అనుమానాలు పెనుభూతాలై వెంటాడాయి. దీంతో విసిగెత్తిన‌వారంతా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌రితో ఒక‌రు పోటీ పేరుతో కొట్లాట‌కు, విభేదాల‌కు బాటలు వేసుకున్నారు.  

షర్మిలమ్మ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గొంతు పోయేలా అన్న కోసం మాట్లాడారు, కానీ ఇప్పుడు తండ్రి సమాధి దగ్గర అన్న తనకు అన్యాయం చేశాడంటూ మౌనంగా రోదిస్తున్నారు.  పార్టీని అడ్డు పెట్టుకుని స్వ‌యం వృద్ధిని ఆశించిన జ‌గ‌న్ క్ర‌మేపీ చెల్లి ష‌ర్మిల‌ను దూరం చేశారు. అన్న త‌న తండ్రిలా ప‌రిపాలిస్తాడ‌ని తండ్రి మాట‌, బాట‌, ప్ర‌తిష్ట‌ను కాపాడ‌తాడ‌ని అనుకున్న ష‌ర్మిల విసిగెత్తి మరో  తెలుగు రాష్ట్రం తెలంగాణాకు వలస వెళ్లిపోయారు. అక్క‌డ వేరే పార్టీ పెట్టి నిల‌దొక్కుకోవాల‌ని ప్రయత్నిస్తున్నారు.  ఇప్పుడు తల్లిదీ అదేబాట. కరివేపాకు చందంగా జగన్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేని జగన్మాత.. జగన్ కోరిక మేరకే అయినా తన గౌరవానికి భంగం వాటిల్లకుండా  వైదొలగారు.

తల్లీ చెల్నిని దూరం చేసుకోవడానికి క్షణమైనా ఆలోచించని జగన్ ఇక పార్టీ, రాష్ట్రం సంక్షేమం, శ్రేయస్సు కోసం ఎలా ఆలోచిస్తారని పార్టీ శ్రేణులో అంతర్గత సంభాషణల్లో చర్చలు లేవదీస్తున్నాయి.  ప్రజల్లో పెచ్చరిల్లుతున్న అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహం జగన్ దృష్టికి వెళ్లలేదని అనుకోలేం. అలాగే పార్టీలో పెచ్చరిల్లుతున్న అసమ్మతి కూడా జగన్ కు తెలిసే ఉంటుంది. అందుకే అధికారం, పార్టీలో పెత్తనం రెండూ ఒకే సారి జారిపోతాయన్న భయంతోనే.. తల్లి విజయమ్మకు పార్టీతో అంటీముట్టనట్టుగా  ఉన్న సంబంధాలను కూడా తెంచాశారని విశ్లేషకులు అంటున్నారు.

అదే సమయంలో భవిష్యత్ లో ఎవరూ కూడా పార్టీలో తన నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే శాశ్వతంగా అధ్యక్షుడిగా కొనసాగేలా పార్టీ బైలాస్ ను సవరించి మరీ ప్లీనరీ వేదికగా తీర్మానాన్ని ఆమోదింప చేసుకున్నారు.తల్లీ, చెల్లి పట్ల జగన్ వ్యవహరించిన తీరును గమనించిన  పార్టీ నేతల్లో తమ భవిష్యత్ పట్ల బెదురు ఆరంభమైంది. కొద్ది కొద్దిగానైనా.. జగన్ విధానాల పట్ల పార్టీ నేతల్లో పెరుగుతున్న ధిక్కారం. కొందరైతే అప్పుడే పక్క చూపులు చూస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల సమయానికి జగన్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పే నేతల సంఖ్య గణనీయంగానే ఉంటుందన్న విశ్లేషణలూ చేస్తున్నారు. తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న చందంగా జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే అటు ప్రజల.. ఇటు కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయే పరిస్థితి కొని తెచ్చుకున్నారని అంటున్నారు.  ప్లీనరీ వేదికగా విజయమ్మ రాజీనామా ప్రకటనే ఇందుకు నిదర్శనమంటున్నారు.