TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ప్రగతికి ప్రతిబంధకం!

Published on: Mon Dec 23, 2024 10:02AM

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని విస్తృతంగా ఉపయోగించారు. అలాగే చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ఇద్దరూ జగన్  సమాజానికి చీడపురుగుగా అభివర్ణించారు. జగన్ ను మరో సారి అధికారంలోనికి రానీయకూడదని పదే పదే ప్రజలకు పిలుపు నిచ్చారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారానికి దూరమైంది. అయితే అధికారం కోల్పోయిన తరువాత జగన్, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు అక్షర సత్యాలని నిరూపించే విధంగానే ఉన్నాయి. 

జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా పోయింది. పరిశ్రమలు రావడం మాట అటుంచి ఉన్న పరిశ్రీమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్ అంటూ  వేగంగా జరుగుతున్న పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అమరావతిని నిర్వీర్యం చేశారు. భవనాలను పాడుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత అమరావతి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. దాదాపు ఐదేళ్ల ప్రతిష్ఠంభన తరువాత అమరావతి నిర్మాణం తిరిగి మొదలైంది. అమరావతి కోసం ఆసియా అభివృద్ధి బోర్డు, ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేశాయి. దీంతో సీఆర్డీయే అమరావతి పనుల కోసం టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సంక్రాంతి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. 

సరిగ్గా ఇదే సమయంలో జగన్, వైసీపీయులు చేస్తున్న దుష్ప్రచారం, విమర్శలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకులకు రాసిన లేఖలు, పంపిన ఈ మెయిల్స్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరుల విమర్శలు అక్షర సత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసేవిగా ఉన్నాయి.   రాజధాని అమరావతికి నిధులు ఇవ్వవద్దంటూ ప్రపంచ బ్యాంకుకు ఈమెయిల్స్ వైసీపీయులు ఈమెయిల్స్ పంపారు.   ఆహార భద్రత, పేదల స్థానభ్రంశం, వరద ముంపు వంటి కారణాలు చూపుతూ అమరావతి పురోగతిని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నిస్తూ లేఖలు రాయడం, ఈమెయిల్స్ పంపడం ద్వారా రాష్ట్ర ప్రగతికి తాము ప్రతిబంధకమని చాటుకుంటున్నారు.  వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న 2014 - 2019 మధ్య కాలంలో కూడా ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వ్యవహార శైలి ఇలాగే ఉంది. అమరావతి పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పుడూ, ఆ తరువాత అధికారంలో ఉన్న సమయంలోనూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా ప్రయత్నిస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా మూడు రాజధానులంటూ తగ్లక్ విధానాలతో అమరావతిని నిర్వీర్యం చేశారు. అమరావతికి పోటీగా విశాఖ రాజధాని అంటూ అర్భాటం చేసినా, ఆ దిశగా ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు సరికదా  రుషికొండకు గుండు కొట్టి పర్యావరణ వినాశనానికి పాల్పడ్డారు. సొంతానికి విలాస భవంతిని నిర్మించుకోవడంపైనే శ్రద్ధ పెట్టారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు.. స్వప్రయోజనం కోసమే జగన్ తన ఐదేళ్ల అధికారాన్ని వాడుకున్నారు. అభివృద్ధికి తాను, తన పార్టీ పూర్తి వ్యతిరేకమని అధికారంలో ఉండానూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాతా చాటుకుంటున్నారు.