జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర
Published on: Tue May 15, 2012 12:11PM
హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యక్తిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై దుమారం రేగుతోంది. సాక్షాత్తూ సాక్షి దినపత్రిక ప్రారంభంలోనే తాను క్రైస్తవుడనని జగన్ ప్రకటించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అది క్రైస్తవ సంఘాలను కూడగట్టుకునేందుకని అప్పట్లో భావించారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని సాంప్రదాయాలను ఆయన వ్యతిరేకిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని విశ్వహిందూ పరిషత్తు జాతీయ సమావేశంలో నాయకులు సంచలన వ్యాఖ్యలను చేసిన విషయము తెలిసినదే. అయితే ఇటీవల తిరుపతిలో పర్యటించినప్పుడు జగన్ తిరుమలలో పుస్తకంలో సంతకం చేయకుండా హిందువుల మనస్సు గాయపరిచారని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన జగన్ కు జన (ప్రత్యేకించి హిందువుల) ఆదరణ కరువయిందంటున్నారు.
ఇలా హిందువులను వ్యతిరేకిస్తున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత జగన్ కు ఎందుకు ఓటెయ్యలో ఆలోచించాలని లింగారెడ్డి కోరుతున్నారు. ఈయన ప్రకటనతో విశ్వహిందూపరిషత్తు బిజెపి కూడా ఎకీభవిస్తున్నాయి. ఇలా జగన్ పై హిందూవ్యతిరేకి అన్న ముద్రస్థిరపడే అవకాశాలు పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ ఒక్క చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ ఆరోపణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే ఉధృతమైతే జగన్ కి హిందువుల సహకారం అనుమానమే అని రాజకీయపరిశీలకులు తేల్చి చెబుతున్నారు. తన వైఖరిలో మార్పు వస్తే తప్ప జగన్ కు వేరే దారిలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఒక్క జగన్ తప్పించి ఆయన పార్టీని మోస్తున్న వారందరూ హిందువులే అన్న విషయాన్ని వైకాపా (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) గుర్తుంచుకోవాలని హితవు చెబుతున్నారు.


