పది శాతం వాటా ఇస్తే చాలు: జగన్

 

ఈరోజు శాసనసభలో తెదేపా, వైకాపా సభ్యుల మధ్య హత్యా రాజకీయాలపై వాదోపవాదాలు జరిగాయి. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “పరిటాల రవి హత్యతో నాకు ఎటువంటి సంబంధమూ లేకపోయినా, తెదేపా సభ్యులు పదేపదే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ, ఆ కేసుతో సంబంధం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ని తెదేపాలోకి ఏవిధంగా ఆహ్వానించి టికెట్ ఇచ్చారు? నేను లక్ష కోట్లు కూడబెట్టానని తెదేపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. వారు గనుక నిజంగా నావద్ద లక్ష కోట్లున్నాయని నమ్ముతున్నట్లయితే, దానిలో కేవలం పది శాతం నాకిచ్చి మిగిలినది అంతా వారే తీసుకోవచ్చును. తెదేపా నేతలు ఇకనయినా ఈ అసత్య ప్రచారం మానుకోకుంటే వారిపై పరువు నష్టం దావా వేస్తాను,” అని హెచ్చరించారు.