TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ది అవగాహనా రాహిత్యం.. అజ్ణానం.. మంత్రి నారాయణ

Published on: Thu Apr 2, 2026 10:00AM

అమరావతికి చట్టబద్ధత విషయంలో  ధర్మమే గెలిచిందని ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట ముగిసిందన్నారు.  చట్టసభలో అమరావతే రాజధాని అని ఆమోదం పొందినా, వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 ఇప్పటికే 70,790 ప్లాట్లు కేటాయించామని, ఇంక కేవలం 650 మందికి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.  డేటా తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలన్నారు.  తన బొమ్మ కోసం సర్వే రాళ్లపై 750 కోట్లు, పాస్‌బుక్‌ల కోసం పాతిక కోట్లరూపాయల ప్రజాధనాన్ని తగలేసిన జగన్, తన సొంత విలాసాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాజధానిని నిర్మిస్తోందన్న నారాయణ..  అమరావతి వంద  శాతం సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు.

 ప్రభుత్వం దగ్గరున్న 5,000 ఎకరాలు అమ్మి తీసుకున్న రుణాలు తీరుస్తామని, ప్రజల పన్ను నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటే అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా స్టేడియంలు, ఎయిర్‌పోర్ట్‌లతో అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్న నారాయణ..  2028 ఆగస్టు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజే ప్రజలను పక్కదారి పట్టించేందుకు జగన్ మావిగన్ పేరుతో మరో కుట్రకు తెరలేపారని, ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు.