గన్నవరంలో బాబుని తనిఖీ చేసిన ఫోటో.. అంతా ప్లాన్ ప్రకారమా!!

 

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుల తరహాలో తనిఖీలు చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్లుందని, ఫొటోగ్రాఫర్ ను ముందుగానే అక్కడ పెట్టి ఈ తనిఖీలను ఫొటో తీయించారని ఐవైఆర్ ఆరోపించారు. లేదంటే ఇలాంటి ఫొటో బయటకు వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రయాణికుడి నుంచి జడ్ ప్లస్, జడ్ ప్లస్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులు అయినా సరే తనిఖీలు లేకుండా విమానం ఎక్కలేరని ఐవైఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ తనిఖీ బహిరంగంగా చేయాలా? లేక ప్రత్యేకంగా చేయాలా? అన్నది వారికి నిర్ణయించిన ప్రభుత్వ మర్యాదను అనుసరించి ఉంటుందని ఐవైఆర్ తేల్చిచెప్పారు.