బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పై ఐటీ దాడులు.. బీజేపీకి ఓటమి భయం అంటున్న ఆర్జేడీ..

బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పాట్నాలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసారు. ఈ దాడిలో పార్టీ ఆఫీసు బయట పార్క్ చేసిన వాహనంలో రూ. 8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఐతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పై ఐటీ దాడులకు సంబంధించి బీహార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శక్తిసింగ్ గోహిల్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐటీ సోదాలలో ఎటువంటి డబ్బును అధికారులు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు.

 

ఈ సోదాలలో "పార్టీ ఆఫీసు కాంపౌండ్‌కు బయట పార్క్ చేసిన ఓ వాహనంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నందుకు ఐటీ అధికారులు పార్టీకి నోటీసులు జారీచేశారు. ఐతే పార్టీ కార్యాలయం కాంపౌండ్‌లో ఎలాంటి డబ్బులు లభించలేదు. ఐటీ అధికారులకు మేము పూర్తిగా సహకరిస్తాం" అని శక్తిసింగ్ అన్నారు. మరో పక్క రాక్సేల్ ‌ బీజేపీ అభ్యర్థి నుంచి 22 కిలోల బంగారం, 2.5 కిలో వెండి స్వాధీనం చేసుకున్నా కూడా ఐటీ అధికారులు అక్కడికి ఎందుకు వెళ్లరు?" అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తాజా ఐటీ దాడులను కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ, జేడీయూ కూటమి ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయిస్తోందంటే.. దాని అర్థం.. వాళ్లు ఓటమిని అంగీకరించినట్టేనని తీవ్ర వ్యాఖలు చేసింది.

 

ఇది ఇలా ఉండగా మొదటి దశ పోలింగ్‌కు కొద్ది రోజుల గడువు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రతిపక్ష ఆర్జేడీ.. తాము అధికారంలో వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా.. ఆ హామీని తలదన్నెలా బీజేపీ ఏకంగా 19 లక్షలు ఉద్యోగాలతో పాటు బిహార్ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని వారి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అసెంబ్లీ  ఎన్నికలకు కరోనా వ్యాక్సిన్ తో ముడి పెట్టడం పై బిహార్‌లోని ప్రతిపక్షాలే కాకుండా, దేశంలోని పలు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణాలను కాపాడే కరోనా వ్యాక్సిన్‌ను ఎన్నికల్లో ఓట్లకు ముడిపెడతారా అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.