ప్లీనరీ కాదు.. విజయమ్మ వీడ్కోలు సభ.. రఘురామకృష్ణంరాజు
Published on: Fri Jul 8, 2022 5:48PM
వైసీపీ ప్లీనరీని జగన్ తల్లి విజయమ్మ వీడ్కోలు సభగా ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. విజయమ్మ రాజీనామాపై వైసీపీలోనే అసంతృప్తి పెల్లుబుకుతోందనీ, అమ్మ రాజీనామానా అమ్మతో రాజీనామానా అని పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయన్నారు.
విజయమ్మ రాజీనామా తాను ముందే ఊహించానని చెప్పిన రఘురామ రాజు.. రాజీనామా చేయడానికి ముందు ప్లీనరీలో ఆమెకు సముచిత ఆసనం కూడా ఇవ్వలేదని రఘురామరాజు ఎత్తి చూపారు. గౌరవాధ్యక్షురాలి హోదాలో ఆమె చిన్న కుర్చీలో కూర్చున్నారని, కొంచం పెద్ద కుర్చీ వేస్తే ఒకింత గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
విజయమ్మ రాజీనామా ఎంత కరెక్టో.. విజయమ్మతో రాజీనామా కూడా అంతే కరెక్టన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలులో ఉన్నప్పుడు దేహీ అన్నట్లుగా ఆమె ఇల్లిల్లూ తిరిగారనీ, కుమారుడికి బెయిలు కోసం సోనియా కాళ్లు పట్టుకున్నారన్న సమాచారం కూడా తన వద్ద ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా పార్టీని సొంత జాగీరుగా చేసుకోజాలరని అన్న రఘురామకృష్ణం రాజు శాశ్వత అధ్యక్షుడు అన్న కాన్సెప్టే ఉండదన్నారు.
అసలు దేశంలో ఎక్కడైనా ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉన్నారా అని ప్రశ్నించారు. తానూ పార్టీ సభ్యుడినేనన్న రఘురామకృష్ణం రాజు సంస్థాగత ఎన్నికలు జరిగి తీరాల్సిందేననీ, ఒక వేళ ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదేళ్లు మాత్రమే ఉండాలన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని కోర్టే తెలుస్తుందన్నారు.


