TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇది అక్కినేని శత జయంతి సంవత్సరం.. అందుకే?

Published on: Mon Dec 30, 2024 11:59AM

ప్రధాని నరేంద్రమోడీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశ వాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆయన తన మన్ కీ బాత్ లో కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావించి వారు ఆయా రంగాలలో దేశానికి చేసిన సేవలను ప్రస్తుతించారు. అందులో భాగంగానే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు ప్రస్తావించి దేశ సంస్కృతి, విలువలకు అద్దం పట్టేలా అద్భుతమైన సినీమాలు చేశారని ప్రశంసలు గుప్పించారు. అక్కినేనితో పాటుగా ఆయన బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ అని చెప్పుకోదగ్గ రాజ్ కపూర్, అలాగే అద్భుత గాయకుడు మహ్మద్ రఫీ తదితరుల పేర్లు కూడా ప్రస్తావించారు. 

దీంతో తెలుగు రాష్ట్రాలలో కొందరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు విస్మరించారంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టేశారు. ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ మోడీ తెలుగుదేశం పార్టీని ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదనీ, అందుకు తార్కానం తన మన్ కీబాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మాత్రమే ప్రస్తావించి, ఎన్టీఆర్ ను విస్మరించారనీ విష ప్రచారం మొదలు పెట్టేశారు. 

ఇక్కడ వారు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన విషయమేమిటంటే.. ఇది ఏఎన్నార్ శత జయంతి సంవత్సరం. అలాగే నటుడు రాజ్ కపూర్, గాయకుడు మహ్మద్ రఫీల శతజయంతి సంవత్సరం కూడా. అందుకే ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో వారి పేర్లు ప్రస్తావించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.  అయితే మోడీ మన్ కీబాత్ ను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి కుత్సితత్వాన్ని బయట పెట్టుకున్నారు. తెలుగు సీని పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల వంటి వారు. నటన విషయంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువా అని చెప్పడానికి అవకాశం లేదు.