TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇస్రో శాస్త్రవేత్త సురేష్ ను హత్య చేసింది తన కొలీగ్ శ్రీనివాస్: పొలీసులు 

Published on: Fri Oct 4, 2019 6:27PM

 

హైదరాబాద్ లో ఇస్రో సైంటిస్ట్ హత్య కలకలం సృష్టించింది. ఎస్.ఆర్ నగర్ లో అన్నపూర్ణ అపార్ట్ మెంట్ రెండవ ఫ్లోర్ లో నివాసముంటున్న ఇస్రో శాస్త్రవేత్త హత్యకు గురయ్యాడు. క్లూస్ టీమ్ తో హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. వెస్ట్ జోన్ ఇన్ చార్జి డీసీపీ సుమతి, ఏసిపి తిరుపతన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు, సురేష్ తలపై బలమైన గాయం ఉన్నట్టు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావించారు. శాస్త్రవేత్తే సురేష్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మరియు ఇస్రో లో పనిచేస్తున్నారు. మృతుడు కేరళవాసి, వృత్తిరీత్యా గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ లో ఉన్నారు. సురేష్ భార్య బ్యాంకు ఉద్యోగి, చెన్నైలో నివాసముంటోంది, ఉద్యోగ రీత్యా కుమారుడు అమెరికాలో, కుమార్తె ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్నారు.

అయితే శాస్త్రవేత్త సురేష్ ను తన తోటి ఉద్యోగి అయిన శ్రీనివాస్ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సుమారుగా మూడు నెలల నుంచి వీరిద్దరికీ పరిచయమున్నట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరూ స్వలింగ సంపర్కం చేసుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని గ్రహించి, తన దగ్గర డబ్బులు తీసుకోవచ్చని శ్రీనివాస్ అనుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి సురేష్ నిరాకరించడంతో.. హత్యకు దారితీసింది. సురేష్ ను తలపై కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందుతుడు శ్రీనివాస్ ను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు.