TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ విమానాశ్రయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు

Published on: Tue Apr 7, 2026 12:33PM

మిడిల్ ఈస్ట్ లో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది.  గత నెలన్నరగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు  ముదిరి పాకాన పడ్డాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ..  ఆ దేశంలోని అత్యంత కీలకమైన విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడింది.  

 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అలాగే.. విమానాశ్రయం సమీపంలోనే ఉన్న ఇరాన్ వైమానిక దళానికి చెందిన కీలక యుద్ధ విమాన  స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు ప్రధాన విమానాశ్రయాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.  

ఇజ్రాయెల్  దాడుల్లో ఇరాన్‌కు భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.  వైమానిక స్థావరాల్లో ఉన్న డజన్ల కొద్దీ అత్యాధునిక యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. కేవలం విమానాశ్రయాలే కాకుండా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన సాయుధ దళాల స్థావరాలపై కూడా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.  ఇరాన్ వైమానిక శక్తిని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు యుద్ధ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఐఆర్‌జీసీ బలగాల కదలికలను నియంత్రించడం ద్వారా ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజా పరిణామాలతో ఇరాన్ ఎదురుదాడి చేసే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

కాగా ఈ దాడులపై  అమెరికా సహా కొన్ని దేశాలు హర్షం వ్యక్తం చేస్తూ సమర్ధిస్తుంటే.. రష్యా వంటి దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.   కాగా ఈ దాడుల కారణంగా  టెహ్రాన్  విమానాశ్రయంలో  విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.  ఈ దాడులపై ఇరాన్ ఎలా రియాక్ట్ కానుందన్న ఆసక్తి, ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.