ఒక్క ఏడాదిలో ఎంత మార్పు.. విజయసాయిని పక్కన పెట్టేశారా?

2019 మే 23. 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని వైసీపీ ఘన విజయం సాధించిన రోజు. సీఎం కావాలనే వైఎస్ జగన్ కల నిజమైన రోజు. ఆ రోజు వైసీపీ శ్రేణుల ఆనందం అంతాఇంతా కాదు. పక్కనే జగన్ ఉంటే.. ఆయనను కౌగిలించుకుని మనం గెలిచామని గట్టిగా అరిచే అంత ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఆ అదృష్టం మాత్రం పార్టీలో ఒక్కరికే దక్కింది. ఆ ఒక్కరు ఎవరో కాదు విజయసాయి రెడ్డి. ఆ రోజు జగన్ ని కౌగిలించుకుని విజయసాయి తన ఆనందాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఆ ఫోటో బాగా వైరల్ అయింది. వైసీపీ శ్రేణులు ఆ ఫోటోని చూసి తెగ మురిసిపోయారు. ఎందుకంటే వైసీపీలో జగన్ తరువాత ఎక్కువగా వినిపించే పేరు విజయసాయి. ఆయన వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగారు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తరువాత కూడా విజయసాయి పార్టీలో కీలకంగా, చురుకుగా వ్యవహరించారు. అందుకే వైసీపీ శ్రేణులు.. పార్టీలో జగన్ తరువాత విజయ సాయే అన్నట్టు భావించేవారు. జగన్ కూడా విజయసాయి కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ వ్యవహారాల్లోనూ అంతే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీలో మునుపటిలా విజయసాయి జోరు కనిపించట్లేదు. ఓ రకంగా, జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల, సీఎం జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళే సమయంలో.. కారెక్కిన విజయసాయిని దించేసి మరీ మంత్రి ఆళ్ళ నానిని ఎక్కించుకుని వెళ్లారు. ఆ వీడియో బయటకు రావడంతో జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారని, మునుపటిలా ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న ప్రచారం మొదలైంది. మరోవైపు, కారు నుంచి దించేయడంతో విజయసాయి నొచ్చుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, విజయసాయి మద్దతు దారులు మాత్రం.. హెలికాప్టర్ లో చోటులేదని, బాధితులను పరామర్శించటానికి వెళుతున్నారు కాబట్టి ఆరోగ్య మంత్రి ఆళ్ళ నానిని తీసుకెళ్ళారని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా పరిణామాలు గమనిస్తే మాత్రం.. విజయసాయికి ప్రాధాన్యత తగ్గిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాల్లో పలువురు కీలక నేతలు కనిపించారు.. కానీ ఎక్కడా విజయసాయి కనిపించలేదు. సరే, ఆ సమావేశాలకు విజయసాయి ఎందుకు వస్తారులే అనుకున్నా.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ ఉత్సవాల్లో కూడా ఆయన కనిపించకపోవడం పార్టీలో కలకలం రేపుతోంది. విజయసాయి శుక్రవారం సాయంత్రమే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారని కొందరు అంటున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి శనివారానికి సరిగ్గా ఏడాది. అలాంటిది ఆ ముందురోజు విజయసాయి హైదరాబాద్ వెళ్లడం ఏంటి?. పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజున ఆయన కనిపించకపోవడం.. పలు అనుమానాలకు దారితీస్తోంది. అదీగాక, విజయసాయి ట్విట్టర్ లో బాగా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా జగన్ ని ప్రశంసిస్తారు, టీడీపీ నేత చంద్రబాబు పై విరుచుకుపడతారు. ఈరోజు కూడా అలవాటు ప్రకారం విజయసాయి చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ.. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జగన్ నిజంగానే విజయసాయిని దూరం పెడుతున్నారా? అది తెలిసి విజయసాయి కూడా చిన్నగా సైడ్ అవుతున్నారా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? అంతా ఆ జగన్నాధుడికే తెలియాలి.