TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారతీకి కీలక బాధ్యతలు!?

Published on: Fri Apr 8, 2022 11:39AM

ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతీకి కొత్త బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైనట్లు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఓ టాక్ అయితే వైరల్ అవుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవిని త్వరలో వైయస్ భారతీ.. తన భుజస్కంధాలపైకి ఎత్తుకోబోతున్నారనే తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అంతేకాదు.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. చేపట్టాల్సిన విధివిధానాలు.. తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆమె ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ నియామకం పార్టీ ప్లీనరీ సమావేశాల తర్వాత ఉంటుందని ఫ్యాన్ పార్టీలోనే బలంగా వినిపిస్తోంది. 

మరోవైపు వైయస్ జగన్‌కు సొంత మీడియా సంస్థల బాధ్యతలను ప్రస్తుతం వైయస్ భారతీనే చూసుకుంటున్నారు. అయితే సదరు సంస్థలకు కొత్త సీఈవోగా ఆమె సమీప బంధువు.. ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ను నియమించినట్లు సమాచారం. ఆ విధంగా తనపై ఉన్న భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే భారతీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే కాదు.. ఆయన అక్రమాస్తుల కేసులో దాదాపు 16 నెలలు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా.. జగనన్న వదిలిన బాణమంటూ ఆయన సోదరి వైయస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అలాగే జగన్ అధికారం చేపట్టే వరకు.. ఓ వైపు షర్మిల, మరోవైపు వైయస్ విజయమ్మ.. కంటి మీద కునుకు లేకుండా ప్రజల్లోకి వెళ్లి మరీ ప్రచారం చేశారు. 

ఆ క్రమంలో రాజన్న రాజ్యం తీసుకు రావడానికి జగనన్నకు ఒక్క ఛాన్స్.. బాబుకు బై బై అనే స్లోగన్‌లను వీరిద్దరు తమ భూజానికెత్తుకున్నారు. మరోవైపు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ అయితే.. తెరచాటుగా బావమరిది వైయస్ జగన్ పార్టీ గెలుపు కోసం.. ఆయన అధికార పీఠం ఎక్కటం కోసం ఎంత చేయాలో అంత చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఆ తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించడం.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత.. ఆయన తల్లి వైయస్ విజయమ్మ, ఆయన సోదరి వైయస్ షర్మిలను దూరంగా పెట్టడం.. ఈ విషయాన్ని గమనించిన వీరు... ఆ పక్కనే ఉన్న తెలంగాణకు తరలి వెళ్లారు. హైదరాబాద్‌లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అనే రాజకీయ పార్టీని వైయస్ షర్మిల స్థాపించి.. ఆ పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైయస్ జగన్ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరి .. ఆంధ్రలో అధికారంలో ఉన్న పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉండి.. తెలంగాణలో మరో పార్టీతో వైయస్ విజయమ్మ అంటకాగడం ఏమిటంటూ నెటిజన్లు... సోషల్ మీడియా సాక్షిగా ఏకిఏకీ పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్ విజయమ్మ.. తన కుమారుడు వైయస్ జగన్‌ను కలిసి.. పార్టీ గౌరవ అద్యక్షురాలి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

పార్టీ ప్లీనరీ సమావేశాలు త్వరలో జరగనున్నాయి.. నాటి వరకు ఆగాలంటూ విజయమ్మతో ఏపీ సీఎం జగన్ పేర్కొన్నట్లు సమాచారం. అదీకాక.. జగన్ పార్టీలో గత ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేసిన ప్రచారకర్తలు అంటే.. వైయస్ విజమయ్మ, వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ తదితరులు నేడు ఫ్యాన్ పార్టీకి బాగా దూరం జరిగారు. అలాగే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇటీవల టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకులోనైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వానికి.. సినీమా పరిశ్రమలోని వారికి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. 

అలాంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ప్రచారానికి టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమే కాకుండా..  ఆ పార్టీ తరపున ప్రచారం చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, పోసాని తదితరులకు నేడు సినిమా అవకాశాలు లేకుండా పోయాయని.. ఓ టాక్ అయితే ఫిలింనగర్‌లో రచ్చ రచ్చగా నడుస్తోంది. అలాంటి వేళ.. జగన్ పార్టీ తరఫున.. టాలీవుడ్ నుంచి వచ్చి మరీ ప్రచారం చేసేవారు ఎవరని ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ తరపున ప్రచారానికి సీఎం జగన్ తన సతీమణి వైయస్ భారతీని రంగంలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయని తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఓ టాక్ అయితే తెగ వైరల్ అవుతోంది.