యోగి సీఎంయేనా లేక చీఫ్ జస్టిస్సా..?
Published on: Mon Jun 13, 2022 11:39AM
మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పనులు వారు చేయాలి. ముఖ్యమంత్రి మంత్రివర్గంతో కలిసి రాష్ట్ర అభి వృద్ధి పనుల మీద దృష్టిపెట్టాలి. కానీ యోగీ ఆదిత్యనాథ్ పద్ధతి అందుకు విరుద్ధంగా వుందని కోపగించు కున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
ప్రయాగ్రాజ్ అల్లర్ల సందర్భంగా అరెస్టయిన ప్రధాన నిందితుడు జావెద్ మహమ్మద్ అలియాస్ పంప్ ఇంటిని కూలదోయమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశించడమేమిటి? ఆయన ముఖ్యమంత్రా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమర్తా? అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండి పడ్డారు. జూన్ పదో తేదీన అల్లర్లకు కారకుడు అని పోలీసులు మహమ్మద్ ను అరెస్టు చేశారు. ఆదివారం ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఏ) అతని ఇంటిని కూల్చివేసింది.
జావెద్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు, యాక్టివిస్ట్ అఫ్రీన్ ఫాతిమా తండ్రి. గత ఏడాది కేంద్ర వివాదాస్పద సిటిజన్షిన్ చట్టాన్ని తీ వ్రంగా వ్యతిరేకించినవారితో ఫాతిమా వుంది. అసలు గత వారం జరిగిన అల్లర్లలోనూ ఆమె పాత్రగురించి విచారణా జరుగుతోంది. జావెద్ ఇంట్లో 12 బోర్ పిస్టల్, 315 బోర్ పిస్టల్, కాట్రెడ్జ్లు లభించాయని సీనియ ర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ కుమార్ వాదన. జావెద్ మహమ్మద్ ఇంటి నిర్మాణానికి అసలు అనుమతే లేదని కూల్చివేయాల్సి వస్తుందని, జూన్ 12 ఉదయం 11 గంటలకల్లా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు పంపారు. కానీ చిత్రమేమంటే అసలు ఆ ఇంటి యజమాని జావెద్ భార్య.
ఆమె పేరుతో వున్న ఇంటిని కూల్చివేయాలంటే నోటీసు ఆమె పేరుమీద పంపాలి. అందుకు భిన్నంగా మహ్మద్ పేరుతో నోటీసు పంపడమేమిటని అసదుద్దీన్ విమర్శించారు.బిజెపి మాజీ అధికార ప్రతినిధి మహమ్మద్ ప్రవక్త పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఉత్తర ప్రదేశ్లో ప్రార్ధనల అనంతరం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగేయి. శనివారం ఉదయం మునిసిపల్ సిబ్బంది పోలీసుల పహారాలో షాహారాన్పూర్లో ఇద్దరు నిందితుల ఇళ్లను కూల్చివేసేరు. అలాగే కాన్పూర్లోనూ ఇళ్ల కూల్చివేత జరిగింది. గుజరాత్ కచ్లో జరిగిన సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ విధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిలా ఆదేశాలు జారీ చేయడం, వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఇళ్ల కూల్చివేతను చేపట్టడమేమిటని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ మధ్య అల్లర్ల సందర్భంగా 300 మందికి పైగా అరెస్టయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ పేర యోగి రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


