TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రజినీకి ఐటీ శాఖ‌?.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ ఇదేనా?

Published on: Fri Apr 1, 2022 11:27AM

వైయస్ జగన్ కొత్త కేబినెట్‌లో గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజినీకి బర్త్ కన్‌ఫార్మ్ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో టాక్‌ నడుస్తోంది. అదే జిల్లాకు చెందిన హోం మంత్రి సుచరిత ప‌ద‌వి పోయి.. అది విడ‌ద‌ల వారిని వరించ‌నుంద‌ని తెలుస్తోంది. రజినీ బీసీ మహిళ.. ఫారెన్ రిటర్న్.. యూఎస్‌లో ఉద్యోగమే కాదు.. వ్యాపారం చేసి.. ఆ తర్వాత స్వస్థలం చిలకలూరిపేటకు తిరిగి వచ్చి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపైనే పోటీ చేసి.. గెలిచి.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టి.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర క్రెడిట్ కొట్టేశారు. అప్పుడే ఆమెకు మినిస్ట‌ర్ పోస్ట్ వ‌స్తుంద‌ని అన్నారు. కానీ రాలేదు. ఈసారి ప‌క్కా అంటున్నారు.

మరోవైపు విడదల రజినీ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో ఆమెకు ఐటీ శాఖ అప్పటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ రెడ్డి.. ఇటీవల ఆకస్మిక మృతి చెందారు. ఈ నేపథ్యంలో రజినీకి ఐటీతోపాటు పరిశ్రమల శాఖను కూడా  అప్పగిస్తారని తెలుస్తోంది. విడదల రజినీకి ఇంగ్లీషు భాషపై మంచి పట్టు.. అంతకు మించి.. మంచి వాగ్ధాటి.. ఆమె మంత్రి పదవి చేపట్టేందుకు అదనపు అర్హతలు అనే ఓ చర్చ కూడా తాజా తాజాగా నడుస్తోంది. మరోవైపు.. ప్రతిపక్ష టీడీపీకి బీసీ వర్గమే వెన్నుముక. ఆ వర్గం వారి ఓట్లే.. సైకిల్ పార్టీకి అత్యంత కీలకం. దాంతో సదరు వర్గం వారికి కీలక శాఖలు కట్టబెట్టడం ద్వారా.. వారి ఓట్లను ఫ్యాన్ పార్టీ వైపు మళ్లించుకోవాలనే ఓ ఆలోచనతో సీఎం జగన్ ముందు చూపుతో వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సమయం.. ఈ నేపథ్యంలో ఆచీ తూచీ అడుగులు వేయాలి. అలా అయితేనే.. మళ్లీ ఎన్నికల్లో నెగ్గగలం.. ఆ క్రమంలోనే సీఎం జగన్ .. మలి మంత్రి వర్గ కూర్పు చేశారని ఓ చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా నడుస్తోంది.

2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ తరఫున పని చేసేందుకు యూఎస్ నుంచి కొంత మంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. వారిలో విడదల రజినీ కూడా ఉన్నారు. అలాగే విశాఖ వేదికగా జరిగిన టీడీపీ మహానాడు వేదికపై నుంచి రజినీ మాట్లాడి.. సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆమెకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రాజకీయాల్లో ఓనమాలు నేర్పారు. అలా 2019 ఎన్నికల వేళ.. చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని విడదల రజినీ భావించారు. కానీ పత్తిపాటి పుల్లారావుకు సీట్ కన్‌ఫార్మ్ అని టీడీపీ అగ్రనాయకత్వం చెప్పడంతో.. ఆమె ఫ్యాన్ పార్టీలో ఇలా చేరి.. ఆలా ఎమ్మెల్యే అయ్యారు. అయితే విడుదల రజినీకి సీఎం జగన్ ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నాయట. ఆ క్రమంలో ఆమెకు కేబినెట్‌లో బర్త్ కన్‌ఫార్మ్ అని తెలుస్తోంది.   

మరోవైపు.. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో.. ఆయన భార్య శ్రీకీర్తిని కూడా కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమెకు అత్యంత కీలక మంత్రి పదవి కట్టబెడతారని సమాచారం. అలాంటి వేళ.. జగన్ కేబినెట్‌లో వీరిద్దరు మాత్రం కన్‌ఫార్మ్ అని ఓ చర్చ అయితే మస్త్ మస్త్‌గా నడుస్తోంది.